Friday, November 30, 2012

మన ఆహారం... మన గొప్పదనం...

(ఇండియన్ డైటేటిక్ అసోసియేషన్ స్వర్ణోత్సవాల సందర్భంగా ‘భారత ఆహారాలు-ఆరోగ్యం’పై సెప్టెంబర్ 29 నుంచి డిసెంబర్ 1వరకు హైదరాబాద్‌లో సదస్సు జరుగుతున్న నేపథ్యంలో...)

తిండి కలిగితే కండ గలదోయ్... అన్నాడు మహాకవి గురజాడ. పనిచేయాలంటే తగినంత శక్తి ఉండాలి కదా... అయితే పనిచేయడానికి మాత్రమే కాదు మనిషి మూర్తిమత్వాన్ని, వ్యక్తిత్వాన్ని, వ్యవహారశైలిని కూడా తినే తిండి నిర్దేశిస్తుందని మన వేదాలు ఘోషిస్తున్నాయి. మనిషి వ్యవహారశైలి, పని స్వభావంపై ఆహారం ప్రభావం చూపిస్తుందని భగవద్గీతలో ప్రస్తావన ఉంది. ఆహారం మెదడుపైన ప్రభావం చూపిస్తుంది కనుకనే మనలో సత్వ, రజో, తమో గుణాలు ప్రేరేపణకు గురవుతుంటాయి. మన న్యాయశాస్త్రంలోనూ ఆహార పదార్థాల గురించిన వివరణ ఉంది. ద్రవ్య, గుణ, కర్మ, సామాన్య, విశేష, సమావయ, అభవ పదార్ధాలుగా వాటిని వివరించారు. అందుకే వేదకాలానికి పూర్వం నుంచే అన్నం పరబ్రహ్మ స్వరూపమైంది.

వ్యాధులు, ఆరోగ్యంలో ఆహార పదార్ధాల పాత్రపై మన పూర్వీకులకు పూర్తి అవగాహన ఉండేది. ఉప్పు అధికంగా తీసుకంంటే వచ్చే ఎగ్జిమా, అసిడిటీల గురించి, స్వీట్లు ఎక్కువ తింటే పెరిగే కఫ దోషాల గురించి వారికి అనాడే తెలుసు. వాటికి విరుగుడుగా మంచి ఆహార అలవాట్లను, దోషనివారణకు అనువైన సాంప్రదాయ వైద్య ప్రక్రియలను అనాడే అభివృద్ధి చేసుకున్నారు. కానీ కాలం మారింది. నేడు కొత్త తరం ఆహార పదార్ధాలు వచ్చేశాయి. మనదేశంలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో ఆహార అలవాట్లలో విపరీతమైన మార్పులు వచ్చాయి. జీవన విధానమూ మారిపోయింది. సాంప్రదాయ భారత ఆహారం గింజధాన్యాలతో నిండి ఉండేది. దంపుడు బియ్యం స్థానంలో బాయిల్డ్ రైస్ వచ్చి చేరాయి. తెల్లబియ్యం వచ్చిన తర్వాత మిగిలిన రకాలను తినడమే మానేశారు.

గోధుమ పరిస్థితీ ఇంతే. చపాతీల స్థానాన్ని రిఫైన్డ్ గోధుమతో తయారయ్యే బ్రెడ్‌లు ఆక్రమించాయి. అమెరికన్లు, యూరోపియన్లు మన వంటకాలు నేర్చుకుని వాటిలో ఉన్న పోషక విలువలను తెలుసుకుని ఆశ్చర్యపోతుంటే భారతీయులు మాత్రం వారి పిజ్జాలు, బర్గర్ల వెంటపడుతున్నారు. జొన్నలు, సజ్జలు, రాగులను పూర్తిగా వదిలేశారు. ఇపుడు తింటున్న రిఫైన్డ్ ఆహారంలో చాలా రకాల విటమిన్లు, మినరల్స్ ఉండడం లేదు. దాంతో రోగనిరోధక శక్తి కనుమరుగైపోతున్నది. వ్యాధులు పెరిగిపోయాయి. వయసుతో నిమిత్తం లేకుండా గుండె సంబంధ వ్యాధులు, హైపర్‌టెన్షన్, ఊబకాయం, డయాబెటిస్ వంటివి దాడి చేస్తుండడానికి కారణం మనం తినే ఆహారమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మన శరీర తత్వాన్ని, మన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా అనేక వ్యాధుల బారి నుంచి తప్పించుకోవచ్చని వారు చెబుతున్నారు. సరిహద్దులో నిరంతరం దేశరక్షణ బాధ్యతలను చూస్తున్న సైన్యాన్ని ఇందుకు ఉదాహరణగా తీసుకోవచ్చు. వారు ఎడారిలో, కొండకోనల్లో, మైదాన ప్రదేశాలలో కాపలా కాస్తుంటారు. అందుకే వారి కోసం రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ప్రత్యేక ఆహారాన్ని అందిస్తున్నది. సైనికులు దేశాన్ని రక్షిస్తున్నట్టే మనమూ మన దేహాన్ని రక్షించుకోవాలి. ఈ విషయంలో మన పరిశోధనా సంస్థలు తీసుకుంటున్న జాగ్రత్తల నుంచి మనమూ పాఠం తీసుకోవాలి. మన ఆరోగ్యాన్ని, శరీరాన్ని దృష్టిలో ఉంచుకుని ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. అపుడే ఆరోగ్య భారత్ ఆవిష్కృతమవుతుంది.

- పి. తులసీకుమారి


No comments: