Thursday, October 4, 2012

వైట్‌హౌజ్‌లో పాగా ఎవరిది?






డెమోక్రాటిక్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా, రిపబ్లికన్ అభ్యర్థి మిట్ రోమ్నిల మధ్య ఎన్నడూ లేనంతగా రసవత్తర పోరుకు తెరతీయడం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేపుతోంది


అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్నకొద్ది మరింత ఉత్కంఠను రేపుతున్నాయి. డెమోక్రాటిక్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా, రిపబ్లికన్ అభ్యర్థి మిట్ రోమ్నిల మధ్య ఎన్నడూ లేనంతగా రసవత్తర పోరుకు తెరతీయడం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేపుతోంది. రోమ్ని నుంచి ఒబామా గట్టి పోటీని ఎదుర్కొంటున్నారనేది వాస్తవమే అయినప్పటికీ.. ఇప్పటికి ఒబామా అధిక్యంలో ఉండటం డెమోక్రాటిక్ వర్గాలకు ఊరట కలిగించే విషయం. గత కొద్ది రోజుల వరకు రోమ్నిపై స్వల్ప ఆధిక్యాన్నిఒబామా ప్రదర్శించినట్టు సర్వేలు వెల్లడించాయి. అయితే అధ్యక్ష ఎన్నికలపై తొలి చర్చాకార్యక్రమానికి ముందు వెల్లడించిన సర్వే ఫలితాలు డెమోక్రాటిక్ పార్టీలో గుబులు రేపుతోంది. శ్వేత భవనంలో పాగా వేయడానికి ఒబామా, రోమ్నిలు హోరాహోరీగా పోరాటం చేస్తున్నారని తాజా సర్వేల ఫలితాల వెల్లడించాయి. ఎన్ బీసీ న్యూస్, వాల్ స్ట్రీట్ జర్నల్, సీఎన్ఎన్ పోల్స్ వెల్లడించిన సర్వేలో ఒబామాకు 49 శాతం, రోమ్నికి 46 శాతం మద్దతు లభిస్తోందని తెలిపింది.
 
 

బుధవారం రోజున కోలరాడోలోని డెన్వర్ లో ఒబామా, రోమ్నిలు తొలిసారి ముఖాముఖి చర్చకు సిద్దమయ్యారు. అయితే ఓటింగ్ ప్రక్రియకు తొలి చర్చా కార్యక్రమం కీలకంగా మారనుందని.. చర్చా కార్యక్రమం ప్రకారం ఓటు ఎవరికి వేయాలనేది నిర్ణయం జరుగుతుందని ఎన్ బీసీ, వాల్ స్ట్రీట్ జర్నల్ సర్వేలో ఓటర్లు తమ మనోగాతాన్ని వెల్లడించారు. అయితే సర్వేలో ఆసక్తి కరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశ ఆర్ధిక పరిస్థితి గతి తప్పిందని 53 శాతం మంది వెల్లడించగా.. 40 శాతం మంది అమెరికాకు ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమి లేదని అభిప్రాయపడ్డారు.

అధ్యక్ష ఎన్నికల కోసం ఒబామా, రోమ్నిల మధ్య జరిగే చర్చ కీలక పాత్ర పోషించనుందని.. నవంబర్ 6 తేదిన జరిగే ఎన్నికల్లో ముఖాముఖి చర్చనే కీలకంగా మారనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నిరుద్యోగం, లోటు బడ్జెట్ లాంటి ప్రధానమైన ఆర్ధిక పరమైన సమస్యల నుంచి రోమ్నిగట్టేక్కిస్తారని ఎక్కువమంది ఓటర్లు భావిస్తున్నారు. ఇందుకు భిన్నంగా విద్య, వైద్య, ఆరోగ్యం లాంటి అంశాల్లో ఒబామా పనితీరు గొప్పగా ఉంటుందని మరికొంతమంది ఓటర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. గత సెప్టెంబర్ మాసంలో వెల్లడించిన సర్వేలలో రోమ్నిపై ఒబామా 5 పాయింట్ల అధిక్యతను కొనసాగించారు. అయితే తాజా సర్వే ఫలితాల ప్రకారం ఒబామా ఆధిక్యతను 3.4 శాతానికి రోమ్ని తగ్గించడంలో కొంత సఫలీకృతమయ్యారు. ఒబామాకు స్పానిష్ దేశస్తుల, యువ, మహిళా ఓటర్ల మద్దతు పుష్కలంగా ఉండగా..రోమ్నికి శ్వేత జాతి ఓటర్లు, విద్యావంతులైన పురుషుల మద్దతు ఉన్నట్టు తెలుస్తోంది. డెన్వర్ లోజరిగే చర్చావేదిక ద్వారా సరియైన ఎంపిక చేసుకోవాలని అమెరికన్ ఓటర్లను కోరేందుకు ఒబామా క్యాంపు సిద్ధమైంది. అయితే అధ్యక్ష ఎన్నికల కోసం జరిగే మూడు చర్చాకార్యక్రమాలపైనే అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఇప్పటి వరకు జరిగిన ప్రచారం ఓ ఎత్తుకాగా.. ఇకనుంచి నుంచి జరిగే ముఖాముఖీ పోరాటమే కీలకంగా మారనుండటంతో పార్టీలు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. అయితే నవంబర్ 6 జరిగే ఎన్నికల్లో మరోసారి అమెరికన్ ఓటర్ల మనస్సును చూరగొని.. రెండవసారి శ్వేతభవనంలోకి అడుగుపెడుతారా లేక రోమ్నిధాటికి తలవంచుతారా అనేది అధ్యక్ష చర్చ కార్యక్రమం తర్వాతనే తేలనుంది.

No comments: