హైదరాబాద్... ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రాచీన నగరం. అద్భుత చారిత్రక కట్టడాలకు నిలయం. చార్మినార్, గోల్కొండ, కుతుబ్షాహీ సమాధులు.. ఇలా చెబుతూ పోతే అలనాటి రాజవంశాల ఠీవికి దర్పణంగా నిలిచిన కట్టడాలెన్నో. కానీ వీటిలో ఏ ఒక్కదానికీ ‘యునెటైడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో)’ అధికారికంగా గుర్తించిన ప్రపంచ వారసత్వ కట్టడాల (హెరిటేజ్ బిల్డింగ్) జాబితాలో చోటు దక్కలేదు. నిర్మాణశైలి, చారిత్రక నేపథ్యం పరంగా ఆ కట్టడాలన్నీ అద్భుతమైనవే అయినప్పటికీ.. యునెస్కో రూపొందించిన నిబంధనలు అడ్డుగా మారటంతో ఇవి ఆ జాబితాలో చోటు దక్కించుకోలేదు. తొలుత పెద్దగా పట్టించుకోని పురావస్తు శాఖ గత మూడేళ్లుగా పట్టువదలకుండా చేస్తున్న ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నాయి.
