Showing posts with label Health. Show all posts
Showing posts with label Health. Show all posts

Wednesday, February 20, 2013

Phobias


భయం చాలా స్వాభావికమైన లక్షణం. అది అందరికీ సహజంగా ఉండేదే. ఉదాహరణకు నేల మీద ఎలుకలు తిరుగుతుంటే చాలామంది భయపడతారు.అలాగే ఎలాంటి హానీ చెయ్యకుండా గోడ మీద బల్లులు తిరుగుతున్నా చాలా మందికి అవంటే భయమే! ఏదయినా భయం అర్థం లేనిదై, అది యాంగ్జైటీని కలిగిస్తూ... మీ దైనందిన వ్యవహారాలను సాగనియ్యనంత తీవ్రంగా ఉంటే దాన్ని‘ఫోబియా’ అంటారు. గతంలో ఫోబియాల మాట ఎలా ఉన్నా ఇప్పుడు వీటిని పూర్తిగా తగ్గించవచ్చు. ఫోబియాల కథా కమామిషులతో పాటు వాటి చికిత్స ప్రక్రియల వంటి అనేక అంశాలపై అవగాహన కోసమే ఈ కథనం. 

భయం విస్తృతి ఎంతంటే!?
మనలోని 29శాతం మందిలో ఏదో ఒక అంశంపై ఫోబియా ఉంటుంది. పురుషులతో పోలిస్తే ఫోబియాలు మహిళల్లో రెట్టింపు మందిని బాధిస్తుంటాయి. 

ఫోబియాతో బాధపడే వ్యక్తుల భవిష్యత్తు... 
కాగ్నిటివ్ థెరపీ లేదా అవసరాన్ని బట్టి ఇతర ప్రక్రియలను కలుపుతూ చేసే చికిత్సలు, రిలాక్సేషన్ టెక్నిక్స్... వీటన్నింటి సహాయంతో ఇప్పుడు ఫోబియాలను పూర్తిగా తగ్గించడం సాధ్యమే. 


ఫోబియా అంటే భయపడకూడని అంశాల పట్ల తీవ్రమైన భయం. చాలా మందికి చాలా విషయాల పట్ల భయాలు ఉంటాయి. ఉదాహరణకు తలుపులు వేసి ఉండే గదుల్లో ఉండటం కొందరికి భయం, అలాగే కొందరికి చాలా ఎత్తుకు ఎక్కడం భయం. కొందరికి హైవే పై డ్రైవింగ్, కీటకాలు, పాములు... ఆఖరికి సూదులన్నా కూడా భయమే. వాస్తవంగా చెప్పాలంటే ఏ అంశం గురించైనా అర్థం లేని భయాలు అభివృద్ధి చెందవచ్చు. ఇవి కొందరిలో చిన్నప్పట్నుంచే ఉంటే... మరికొందరిలో పెద్దయ్యాక అభివృద్ధి చెందవచ్చు. 

అందరిలోనూ సాధారణంగా భయం కలిగించని పరిస్థితికి, అర్థం లేకుండా, నిర్హేతుకంగా భయపడుతూ ఉండే కొందరు తమ భయాలకు తామే ధైర్యం చెప్పుకుంటూ, వాటిని అధిగమిస్తూ ఉంటారు. అయితే కొందరికి తాము భయపడుతున్న అంశాన్ని గుర్తుతెచ్చుకుంటేనే... అంటే సంకల్పమాత్రానే భయం వేస్తుంది. అలాంటిది ఆ పరిస్థితికి ఎక్స్‌పోజ్ అయితే అది మరింత తీవ్రతరమవుతుంది. 

పైన పేర్కొన్న నరాలను మెలిపెట్టే అలాంటి పరిస్థితిని తప్పుకోడానికి మనం నిత్యం చేయాల్సిన కొన్ని పనులను సైతం పక్కన పెట్టి వాటినుంచి పారిపోతూ ఉంటాం. ఇది జీవితంలో ఎన్నింటినో కోల్పోయేలా చేస్తుంది. ఉదాహరణకు ఏదైనా ఎత్తు ప్రదేశంలో ఉండటం అంటే భయం. ఫలితంగా తమ ఉద్యోగరీత్యా బహుళ అంతస్తుల్లో పైన ఉండాల్సి వస్తే ఉండే భయం వల్ల బాగా జీతం వచ్చే మంచి ఉద్యోగాన్ని వదిలేసుకోవాల్సి వస్తే?! ఇలాంటి భయం వల్లనే కొందరు కేవలం ఒక కిలోమీటరు దూరంలో ఉన్న ఆఫీసును ఫ్లై ఓవర్ ఎక్కి దాటడానికి మనస్కరించక కనీసం 20 కి.మీ. అదనంగా డ్రైవ్ చేసుకుంటూ ఆఫీసుకు పోయేవారున్నారు. నిజానికి ఈ భయాలు అర్థం లేనివి. పైగా వాటివల్ల కోల్పోయేది కూడా ఎంతో ఉంది. అలాంటప్పుడు ఆ భయా (ఫోబియా)లకు చికిత్స తీసుకోవడం అవసరమవుతుంది. 

భయం, ఫోబియాల మధ్య తేడా... 
ఏదైనా భయం గొలిపే పరిస్థితుల్లో భయం కలగడం అనేది సహజం. ఆ పరిస్థితుల నుంచి బయటపడటానికి లేదా వాటిని అధిగమించడానికి అది అవసరం కూడా. అంటే భయం అన్నది ఒక రక్షణ కల్పించే చర్య అన్నమాట. ఇక్కడ భయం వల్ల ఒక ప్రయోజనం నెరవేరుతుంది.

భయపడ్డప్పుడు మన శరీరం, మనసు అప్రమత్తంగా మారి ఏ రకమైన చర్యకైనా వెనకాడకుండా తయారవుతాయి. మన స్పందనలు, ప్రతిచర్యలు చాలా వేగవంతంగా మారి మనకు రక్షణ కల్పిస్తాయి. కానీ ఫోబియాలో అలా జరగదు. అక్కడ లేని ప్రమాదాన్ని రోగి ఊహిస్తుంటాడు. ఉదాహరణకు చాలా భయంకరమైన కుక్క ఎదురైనప్పుడు అది కరుస్తుందేమో అని భయపడటం సహజం. కానీ అది పెంపుడు కుక్క అయినా భయపడటం అర్థరహితం. డాగ్ ఫోబియా ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది.

సాధారణంగా మనలో ఉండే భయాలు, ఫోబియాలు
మనందరిలో సాధారణంగా ఉండే భయాలు, ఫోబియాలను నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి... 
జంతువుల ఫోబియా... చాలామందికి పాములు, తేళ్ల వంటి విషజీవులు, సాలెపురుగులు, ఎలుకలు, కుక్కలంటే భయంగా ఉంటుంది. 

స్వాభావిక పరిసరాల్లో కొన్నింటి పట్ల ఉండే ఫోబియా... ఉదాహరణకు ఎత్తుకు ఎక్కాక కిందికి చూడటం వల్ల, తుఫానులు, చాలా విశాలమైన నీటిని, చిమ్మచీకటిని చూసినప్పుడు భయం కలుగుతుంది. 

పరిస్థితుల వల్ల కలిగే ఫోబియాలు: కొన్ని పరిస్థితుల్లో మనకు భయంగా ఉంటుంది. ఉదాహరణకు... తలుపులు మూసి ఉంటే (క్లాస్ట్రోఫోబియా), డ్రైవింగ్ సమయాల్లో, గుహల్లోకి ప్రవేశించినప్పుడు, బ్రిడ్జ్‌పైకి వెళ్లినప్పుడు. 

గాయం, రక్తం, ఇంజక్షన్ వంటి భయాలు: వైద్యచికిత్సలో చేసే ప్రక్రియలు అంటే ఇంజక్షన్ వంటి వాటికి భయపడుతుంటారు. చాలామందిలో నలుగురిలో మాట్లాడటం అన్నా, కీటకాలన్నా లేదా ఎవరికైనా జబ్బుగా ఉండటం లేదా చనిపోతారన్న భయాల వంటివి ఉంటాయి. 

ఫోబియా లక్షణాలు... 
ఏదైనా భయం కాస్తా ఫోబియాగా మారినప్పుడు మొదట యాంగ్జైటీ కలిగి అది తీవ్రమై (ప్యానిక్) చాలా తీవ్రంగా వ్యవహరిస్తారు. దీన్ని ఫుల్‌బ్లోన్ ప్యానిక్ ఎటాక్ అనుకోవచ్చు. మనం భయపడుతున్న విషయానికి ఎంత దగ్గరగా ఉంటే భయం తాలూకు తీవ్రత అంత ఎక్కువగా ఉంటుంది. భయం ఎంత ఎక్కువగా ఉంటే దాని నుంచి బయటపడటం అంత కష్టమవుతుంది. ఈ లక్షణాలు సైతం రెండు రకాలుగా కనిపిస్తాయి. అవి... 

భౌతికంగా కనిపించే లక్షణాలు: ఊపిరి పీల్చుకోవడం కష్టం కావడం గుండె వేగం అధికం కావడం ఛాతీలో నొప్పి లేదా ఛాతీ బిగదీసుకుపోవడం వణుకు నిద్రవస్తున్నట్లు లేదా కళ్లు తిరుగుతున్నట్లు అనిపించడం కడుపులో తిప్పినట్లుగా / దేవినట్లుగా అనిపించడం ఒంట్లోంచి వేడి ఆవిరులు బయటకు వస్తున్నట్లుగా అనిపించడం చెమటలు పట్టడం... వంటివి
ఉద్వేగపూరితమైన లక్షణాలు: యాంగ్జైటీ ఎక్కువ కావడం ఆ తర్వాత ప్యానిక్‌గా మారడం అక్కడి నుంచి పారిపోవాలన్న బలమైన కాంక్ష మనలోంచి మనమే వేరైన అనుభూతి మనపై మనం అదుపు కోల్పోవడం కాసేపట్లో చచ్చిపోతామా అన్న ఫీలింగ్ ఒక విషయం పట్ల మనం మితిమీరి స్పందిస్తున్నామని తెలిసినా దాన్ని నియంత్రించుకోలేని శక్తి. 

ఫోబియాల వల్ల కలిగే దుష్ర్పభావాలు: ఫోబియాలకు చికిత్స చేయించకుండా అలాగే వదిలేస్తే అవి వ్యక్తిగత జీవితాన్ని చాలా దుర్భరం చేస్తాయి. వాటిని దాచిపెట్టినా సరే... దాని ఫలితాలు మీ జీవితాన్ని చాలా తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు. ఉదాహరణకు విమాన ప్రయాణం అంటే భయం ఉంటే దాన్ని దాచితే జీవితంలో చాలా కోల్పోవచ్చు. అలాగే కొన్ని ఫోబియాల వల్ల వ్యక్తిగత జీవితంలో స్నేహితులకు, బంధువులకు దూరం కావడం, ఉద్యోగం కోల్పోవలసి రావడం వంటి తీవ్రపరిణామాలు సంభవించవచ్చు.

ఫోబియా ఉన్నవారు వాటిని అధిగమించదలచినప్పుడు క్రమంగా మెరుగుదల కనిపిస్తుంది. అంతేతప్ప... అకస్మాత్తుగా అంతా చక్కబడిపోదు. ఆల్కహాల్ తాగే అలవాటు ఉన్నవారికి మిగతా వారిలో పోలిస్తే ఫోబియాలకు గురయ్యే అవకాశాలు పదింతలు ఎక్కువ. అలాగే ఫోబియాలు ఉన్నవారు సైతం ఆల్కహాల్‌కు అలవాటు పడే అవకాశాలు సైతం రెండింతలు ఎక్కువ. ఒక్కోసారి ఫోబియా వల్ల కలిగే యాంగ్జైటీ (ఉద్విగ్నత) ప్రమాదకరమైన పరిస్థితికి, ఒక్కోసారి మరణానికి సైతం దారితీసే అవకాశం ఉంది. అది గుండెజబ్బులకూ దారితీయవచ్చు. 

ఫోబియా వర్గీకరణ ఇలా... సైకియాట్రిస్టులు ఫోబియాలను సాధారణంగా మూడు రకాలుగా వర్గీకరిస్తుంటారు. 
సామాజిక ఫోబియా (సోషల్ ఫోబియా): సాధారణంగా ఇవి అందరిలోనూ ఉండే సహజ భయాలే అయినా కొందరిలో మితిమీరి ఉంటాయి. ఉదాహరణకు కొందరు బయట తినడం అనే విషయం పట్ల తీవ్రంగా ప్రతిస్పందిస్తూ దానివల్ల కలిగే పరిణామాలను అతిగా ఊహించుకుంటారు. సాధారణంగా సోషల్ ఫోబియాలు చికిత్సకు సైతం ఒకపట్టాన తేలిగ్గా లొంగవు. సామాజిక ఫోబియాలు తమకు చిన్నప్పుడు ఎదురైన సామాజిక అవమానాల కారణంగా కలుగుతాయి. 

సాధారణంగా పదవ ఏటి కంటే ముందు ఎదురైన సామాజిక అవమానాల కారణంగా ఏర్పడ్డ భయాలు కొందరిలో కాలక్రమేణా తొలగిపోవచ్చు. కానీ యుక్తవయసులో తమ స్నేహితుల నిరాదరణకు గురైన కారణంగా ఏర్పడ్డ భయాలు మాత్రం అంత తేలిగ్గా తొలగిపోవు. అవి వయసుతో పాటు పెరుగుతూ పోవచ్చు. నిర్దిష్ట ఫోబియాలు (స్పెసిఫిక్ ఫోబియాస్): ఈ ఫోబియాలు నిర్దిష్టంగా ఫలానా అంశం వల్ల కలుగుతుండే భయాలు అని చెప్పవచ్చు. ఉదా. పాములు, నీళ్లు, ఎత్తులు, విమానప్రయాణం, రోగభయం... ఇలాంటివన్నమాట. 

అగారోఫోబియా: ఇది ఇంటికి దూరంగా ఉన్నప్పుడు లేదా మనకు సురక్షితంగా ఉన్న స్థలానికి దూరంగా ఉన్నప్పుడు కలిగే తీవ్రమైన భయాలు అని చెప్పవచ్చు. 
ప్యానిక్ అటాక్ అంటే...: ఏదైనా ఫోబియాకు గురై భయపడటంలోని తీవ్రత తారస్థాయికి చేరినప్పుడు కలిగే మానసిక స్థితిని ప్యానిక్ అటాక్‌గా చెప్పవచ్చు. ఇది కలిగినప్పడు కనిపించే లక్షణాలు... తీవ్రమైన భయం గుండెవేగంలోని తీవ్రత చాలా ఎక్కువగా పెరగడం శ్వాస అందకపోవడం వణుకు ఒక్కోసారి స్పృహతప్పడం చనిపోయినట్లుగా అనుభూతి చెందడం అక్కడి నుంచి పారిపోవాలన్న తీవ్రమైన కాంక్ష. 

ప్రతికూల ఆలోచనలను అధిగమించడం... 
వాస్తవానికి ఒక ఫోబియా స్థితిలో అసలు భయం కంటే... దానివల్ల కలిగే ప్రతికూల (నెగెటివ్) ఆలోచనల వల్లనే ఎక్కువగా భయం కలుగుతుంది. ఉదాహరణకు ఒక బ్రిడ్జి మీద వెళ్తుంటే... అది బాగానే ఉన్నా... ఒకవేళ కుప్పకూలితే అన్న ఆలోచన కలగగానే ఆ అనంతర పరిణామాలను ఊహించడం వల్ల కలిగే భయమే ఎక్కువ. 

కాబట్టి ఇలాంటి అనవసరమైన ప్రతికూల ఆలోచనలను దూరం చేసుకుంటే భయాలు కలగనే కలగవు. అలాగే కొన్ని సాధారణ ఆలోచనలనూ వదులుకోవాలి. అంటే... కుక్కలన్నీ కరుస్తాయి. ఎద్దులన్నీ పొడుస్తాయి వంటి జనరలైజ్‌డ్ ఆలోచనలు వద్దు. ఒక ఉత్పాతం తప్పనిసరిగా జరుగుతుందని అనుకోవద్దు. ఉదాహరణకు మీరు విమానంలో ఉంటే అది తప్పక కూలిపోతుందేమోనని లేదా ఒకరికి దగ్గు వస్తే అది తప్పక స్వైన్‌ఫ్లూ కావచ్చేమోనని... ఇలాంటి ఆలోచనలు వద్దు. 

ఏ వయసు పిల్లల్లో 
ఎలాంటి భయాలు...?
పిల్లల్లో సాధారణంగా కొన్ని కొన్ని వయసుల్లో కొన్ని విషయాలంటే భయం అధికంగా ఉంటుంది. అవి... 

0 - 2 ఏళ్ల పిల్లల్లో... పెద్ద శబ్దాలు, అపరిచితులు, తల్లిదండ్రుల నుంచి విడిగా ఉండాల్సి రావడం, పెద్ద పెద్ద వస్తువులంటే భయం. 

3-6 ఏళ్ల పిల్లల్లో... దెయ్యాలు, భూతాల వంటి అభూత కల్పనాత్మక పాత్రలంటే భయంతో పాటు ఒంటరిగా పడుకోవాల్సి రావడం, వింత శబ్దాలంటే భయంగా ఉంటుంది.

7- 16 ఏళ్ల పిల్లల్లో... ఇలాంటి పిల్లల్లో వాస్తవ విషయాలపట్ల అంటే ఆడుతున్నప్పుడు గాయాల భయాలు, జబ్బు భయాలు, తల్లిదండ్రుల మధ్య ఘర్షణ, స్కూల్లో పెర్‌ఫార్మెన్స్ తగ్గుతున్నప్పుడు కలిగే భయాలు, ప్రకృతి విలయాలు, స్వాభావిక ఉత్పాతాలంటే భయాలు ఉంటాయి. 

అధిగమించండిలా...
మీరు ఎలాంటి పరిస్థితుల్లో భయపడుతున్నారో ఆ జాబితాను తయారుచేసుకోండి. ఉదాహరణకు మీకు విమాన ప్రయాణం అంటే భయమనుకోండి. మీరు ఆ క్రమంలో జరిగే అనేక పనులను ఒక జాబితాగా రాయండి.

ఉదా: మీరు టికెట్ బుక్ చేస్తారు. ఆ తర్వాత ప్యాకింగ్, ఆ తర్వాత ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లడం, అనంతరం సెక్యూరిటీ చెక్‌కు వెళ్లడం, విమానం దిగడం - ఎగరడం చూడటం, విమానంలోకి ఎక్కడం (బోర్డింగ్), భద్రత కోసం ఫ్లైట్ అటెండెంట్స్ చెప్పే భద్రత చర్యలను పాటించడం... ఇక ఒక్కోదశలో జరిగే ప్రమాదాలను విశ్లేషించుకోండి. మీకు విమానం ఎగిరే దశలో చాలా కొద్దిపాటి రిస్క్ తప్ప మరేదశలోనూ సమస్య ఎదురవ్వదని అర్థమవుతుంది. అలా విశ్లేషణాత్మకంగా ఆలోచిస్తున్న కొద్దీ భయం తొలగిపోతుంది. 

హైపోకాండ్రియాసిస్...
కొందరిలో ఈ భయాలు పెచ్చుమీరి తమకు ఏదైనా ఆరోగ్యసమస్య ఉందేమో అని అనుమానిస్తుంటారు. ఈ అనుమానం కాస్తా పెనుభూతమై తమకు ఎలాంటి జబ్బు లేకపోయినా ఉన్నట్లుగా ఊహించుకుని భయపడుతుంటారు. అన్నిరకాల వైద్య పరీక్షలు చేయించుకుంటూ, అందులో ఎలాంటి ప్రతికూల ఫలితాలు రాకపోయినా లేని లక్షణాలను ఉన్నట్లుగా ఊహించుకుంటూ బాధపడుతుంటారు.

మాటిమాటికీ పరీక్షలు చేయించుకోడానికి సూదులతో గుచ్చడం వల్ల పడే దుష్ర్పభావాలు, నొప్పి నివారణ మందులు వాడటం, యాంగ్జైటీని తగ్గించే మందులు వాడటం, సమస్య లేకపోయినా మాటిమాటికీ డాక్టర్ల చుట్టూ తిరుగుతూ విలువైన తమ సమయాన్ని వృథా చేసుకోవడం వంటివి చేస్తుంటారు. ఇలాంటి భయాలను కూడా మంచి కౌన్సెలింగ్‌తో తొలగించడం సాధ్యమే.

ఫోబియాలకు చికిత్స...
ఫోబియాకు సమర్థమైన చికిత్స సైకోథెరపీ (కౌన్సెలింగ్). దీనితో పాటు మందులు కూడా ఉపయోగించాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ రెండూ అవసరమవుతాయి. మీ భయాన్ని మీరే ఎదుర్కోండి. మనకు ఏదంటే భయమో ఆ విషయాన్ని మనకు మనమే మెల్లగా ధైర్యం చెప్పుకుంటూ ఎదుర్కొంటూ ఉండాలి. ఈ ప్రయత్నంలో ఫోబియా అన్నది మనం భయపడుతున్నంత భయంకరమైనది కాదని అనిపిస్తున్నకొద్దీ ఫలితం మరింత మెరుగవుతూ పరిస్థితులు మీ అదుపులోకి వచ్చేస్తాయి. 

కొన్నిసార్లు కేవలం 1 నుంచి 4 సెషన్స్‌లోనే ఫలితం వచ్చేస్త్తుంది భయాలను క్రమంగానూ, మాటిమాటికీ ఎదుర్కోవడం... మీకు ఏ విషయం గురించి భయమో దాన్ని నేరుగా ఒకేసారి కాకుండా... క్రమంగా, మాటిమాటికీ ఎదుర్కొంటూ పోతే అది మీరు ఊహించినంత భయంకరమైనది కాదని అర్థమవుతున్న కొద్దీ మీరు మీ భయాన్ని అధిగమిస్తూ, మీ ఫీలింగ్స్‌పై ఆధిక్యత సాధిస్తారు. 

రిలాక్సేషన్ టెక్నిక్స్ నేర్చుకోవడం... 
మనకు ఏదైనా విషయంలో భయం వేయగానే ఉద్విగ్నత (యాంగ్జైటీ) కలుగుతుంది. దానివల్ల గుండెవేగం పెరగడం, ఊపిరి ఆడనట్లుగా ఉండటం (సఫొకేటింగ్) వంటి భౌతిక లక్షణాలు కనిపిస్తాయి. వీటివల్ల మన భయం మరింతగా పెరిగినట్లయి, నిరాశలోకి కూరుకుపోతారు. అందుకే యాంగ్జైటీని అధిగమించే ప్రయత్నంలో భాగంగా రిలాక్సేషన్ టెక్నిక్స్‌ను నేర్చుకుని అవలంబించడం వల్ల క్రమంగా ఉద్విగ్నతను, ప్యానిక్ ఫీలింగ్స్‌ను, భయాన్ని ఎదుర్కొనవచ్చు. రిలాక్సేషన్ టెక్నిక్స్‌లో బలంగా ఊపిరిపీల్చడం (డీప్ బ్రీతింగ్), ధ్యానం, యోగా వంటి వాటితో ఉద్విగ్న పరిస్థితుల్లోనూ స్థిమితంగా ఉండటం ప్రాక్టీస్ చేయవచ్చు. 

కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ): ఫోబియాలను గణనీయంగా తగ్గించేందుకు ఉపయోగపడే చికిత్స ప్రక్రియ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. సీబీటీ అంటే ఒకరకమైన కౌన్సెలింగ్. దీనితో పాటు మందులు కూడా వాడాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకు యాంటీ డిప్రెసెంట్స్, బీటా బ్లాకర్ మెడిసిన్స్, బెంజోడయాజిపైన్స్ వంటి మందులతో పాటూ సీబీటీ చేయాల్సి ఉంటుంది.

Friday, February 8, 2013

థైరాయిడ్ సమతుల్యతతో చర్మంపై పొలుసుల సమస్య మాయం

మానవాళికి ప్రకృతి ప్రసాదించిన కవచకుండళం చర్మం. నేటి ఆధునిక ప్రపంచంలో చర్మసౌందర్యానికి చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రాముఖ్యతనివ్వడం మానసిక స్థైర్యానిపై దానికున్న ప్రభావానికి తార్కాణంగా నిలుస్తోంది. అలాగే ఎముకలు, కండరాలు, రక్తనాళాలు, ఇతర ముఖ్య అవయవాలను కాపాడే చర్మం శరీరంలోనే అతి పెద్ద అవయవం కావడం గమనార్హం. అయితే ఈ చర్మసౌందర్యం, ఆరోగ్యం పెంపొందించడంలో థైరాయిడ్ గ్రంథి పాత్ర గురించి చాలా మందికి తెలియదు.

థైరాయిడ్ గ్రంథి జీవక్రియలకు అవసరమగు టీ3, టీ4, టీఎస్‌హెచ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తూ శరీర అవయవముల ఎదుగుదలకు, రక్తపోటు, గుండె పనితీరు, శరీర ఉష్ణోగ్రత నియంత్రణ, శరీరకణాల జీవరసాయన క్రియలు, ఎముకల ఎదుగుదలకు తోడ్పడుతుంది. థైరాయిడ్, పిట్యూటరి గ్రంథి కలిసి యవ్వనంలో జరుగు జననేంద్రియాల ఎదుగుదల, హార్మోన్ల సమతుల్యతకు తోడ్పడుతాయి. అలాగే చర్మంపై తేమశాతాన్ని క్రమబద్దీకరించడానికి థైరాయిడ్ హార్మోన్లు తోడ్పడతాయి. అయితే దీర్ఘకాలికంగా అసహజక్రియలు చోటుచేసుకున్నప్పుడు శరీరం రోగనిరోధక శక్తిని కోల్పోతుంది. ఫలితంగా వ్యాధులు వచ్చిపడతాయి. అయితే నియంత్రణ ప్రక్రియలో భాగంగా మొదట ప్రభావం పడే అవయవాలలో థైరాయిడ్ మరియు చర్మం ముఖ్యమైనవి చెప్పవచ్చు.

ముఖ్య లక్షణాలు
థైరాయిడ్ పనితీరు శరీర అవసరాలకు తగినంతగా లేనప్పుడు జీవక్రియలు తగ్గిపోయి చర్మం పొడిబారి జీవం లేనట్లుగా మారుతుంది. చెమట కూడా తగ్గుముఖం పట్టి అరిచేతులు, పాదాలు పొడిగా తయారయి చర్మం దళసరిగా పెచ్చులు కట్టినట్లుగా తయారవుతుంది. కొన్నిసార్లు చర్మం రంగు పసుపు వర్ణంలోకి మారటం విటమిన్-ఎ లోపానికి సంకేతంగా నిలుస్తుంది. జుట్టురాలడం, కనుబొమ్మలు పలుచబడటం, గోళ్లు పగిలి ఊడిపోవడం, జుట్టు పలచబడి జీవం కోల్పోవడం, వాపులు రావడం, దురద, గాయాలు త్వరగా మానకపోవడం జరుగుతుంటుంది.

అలాగే బరువు పెరగడం, నిరాశ, అలసత్వం, కండరాలు బిగుసుకుపోవడం, మలబద్ధకం, ముఖంలో మార్పు, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. థైరాయిడ్ గ్రంథి పనితీరు అవసరానికి మించి జరిగినపుడు అంటే టీ3, టీ 4 ఉత్పత్తి పెరిగినపుడు చర్మకణాలకు కావలసిన ప్రొటీన్లు, కొవ్వుకణాలు , కార్బోహైడ్రేట్లు అందకపోవడం వల్ల చర్మం కొన్ని ప్రదేశాలలో పలచబడటం జరుగుతుంది. మరికొన్ని ప్రదేశాలలో దళసరిగా కావడం, మచ్చలు, పొట్టురాలడం జరుగుతుంది. చెమట ఎక్కువగా పట్టడం, కాళ్లవాపు, దద్దుర్లు, దురద వంటి లక్షణాలు కనిపిస్తాయి.

దుష్పరిణామాలు
చర్మంపై పొట్టు సమస్యలకు మూలం కనిపెట్టక చాలా మంది పైపూతలతో సరిపెట్టడం, తాత్కాలిక ఉపశమనంతో తృప్తిచెందడం చేయడం వల్ల సమస్య మరింత జటిలం కావచ్చు. పొట్టుతో కూడిన లక్షణాలకు దీర్ఘకాలంపాటు రకరకాల మందుల వాడినపుడు రోగనిరోధక కణాల కార్యాచరణ మారి శరీర కీళ్లపై దుశ్చర్య మొదలుపెట్టి ఆర్థరైటిస్‌కు దారితీయవచ్చు. థైరాయిడ్ అసమతుల్యత వల్ల ఒబేసిటి, డయాబెటిస్, గుండె సమస్యలు, స్పాండిలైటిస్ సమస్యలు రావచ్చు. స్త్రీలలో హార్మోన్ల అసమతుల్యత వల్ల పీసీఓడి, ఫైబ్రాయిడ్స్ సమస్యలు ప్రారంభం కావచ్చు. సంతానలేమి సమస్య ఉత్పన్నం కావచ్చు.

సంకేతాలు
పొట్టు రాలడం, చర్మంలో పగుళ్లు ఏర్పడటంతోపాటు ఇన్ఫెక్లన్ల వల్ల వాటిపైన ద్రవం కారడం, చీము ఏర్పడటం జరగవచ్చు. తలలో చుండ్రులాంటి లక్షణాలు ప్రారంభమై పెచ్చులు కట్టడం, జుట్టు రాలడం, జుట్టు పలుచబడటం జరుగుతుంది. పెద్దపెద్ద పొలుసులుగా చర్మంపై పగుళ్లు ఏర్పడటం, కొంతమందిలో చెవుల వెనుక, నుదుటిపై పొలుసులు మొదలవడం జరుగుతుంది.

నిర్ధారణ
చర్మలక్షణాలతో పాటు రోగి చెబుతున్న లక్షణాలను బట్టి సమస్య మూలాలను గుర్తించవచ్చు. స్కిన్ బయాప్సీ, ఐజీఈ, ఇస్నోఫిల్ కౌంట్, ఈఎస్ఆర్, సీబీపీ, స్కిన్ అలర్జీ టెస్ట్, హార్మోనల్ అనాలసిస్ వంటివి సమస్య ఉదృతిని తెలియజేస్తాయి. లివర్, కిడ్నీలపై భారాన్ని కనుగొనడానికి స్కానింగ్, సంబంధిత ఫంక్షన్ టెస్ట్‌లు చేయించాలి. థైరాయిడ్ అసమతుల్యతకు సంబంధించి టీ3, టీ4, టీఎస్‌హెచ్ హార్లోన్ల పరీక్ష, థైరాయిడ్ యాంటీబాడీస్, థైరాయిడ్ స్కాన్ వంటివి అవసరం పడవచ్చు.

చికిత్స జాగ్రత్తలు : 
స్వభావ లక్షణాలు, చిన్నతనం నుంచి శరీరంలో జరుగుతున్న ముఖ్య మార్పులు, పర్యవసానాలు చర్మం స్వభావం అంటే తేమశాతం, పొడిగా లేదా జిడ్డుగా ఉండటం, పొక్కులు, పొట్టు స్వభావం పడిన అవయవాలు, ప్రదేశాలు చికిత్సలో కీలకం. ఈ వ్యాధికి తాత్కాలిక ఉపశమనాన్ని అందించే చికిత్స తీసుకోవడం కన్నా సరైన  వైద్యం తీసుకోవడం ఉత్తమం. సరైన చికిత్సతో  రోగనిరోధక వ్యవస్థని పటిష్టం చేయడం వల్ల తర్వాత ఎటువంటి పునరావృతాలు జరగవు. పైగా జీవితాంతం మందులు వాడాల్సిన అవసరం ఉండదు. ఒత్తిడి తగ్గించుకోవడం, వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం వల్ల త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది.

Wednesday, February 6, 2013

హోమియోతో సొరియాసిస్ నుంచి విముక్తి

సొరియాసిస్ ఏ వయసులో వారికైనా వచ్చే అవకాశం ఉంది. మన చర్మం రెండు పొరలతో నిర్మితమై ఉంటుంది. బయటిపొరను ఎపిడెర్మిస్ అని, లోపలి పొరను డెర్మిస్ అని అంటారు. కణాలు డెర్మిస్ పొరలో పుట్టి ఎపిడెర్మిస్‌లోకి వస్తుంటాయి. ప్రతీ 28 నుంచి 30 రోజులకొకసారి ఎపిడెర్మిస్‌లోని కణాలు డెర్మిస్‌లో తయారయిన కొత్తకణాలతో రీప్లేస్ చేయబడతాయి. సొరియాసిస్ వ్యాధిలో కణాలు తయారయ్యే ప్రక్రియ వేగంగా జరుగుతుంది.

కొత్తకణాలు వేగంగా తయారయి చర్మంపై భాగానికి వచ్చేస్తుంటాయి. అధికంగా వచ్చేసిన ఆ కణాలు పేరుకుపోయి బిళ్లల మాదిరిగా తయారువుతుంది. సొరియాసిస్ అంటువ్యాధికాదు. ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. సొరియాసిస్‌ను చర్మానికి సంబంధించిన వ్యాధిగా మాత్రమే పరిగణించి పైపూత మందుల ద్వారా తగ్గించే ప్రయత్నం చేస్తారు. ఈ మందుల ద్వారా అప్పటికప్పుడు ఉపశమనం కనిపించినా, తిరిగి అదే ప్రదేశంలో లేక వేరే ప్రాంతంలో మరింత తీవ్రస్థాయిలో వ్యాధి బయటపడుతుంది. సొరియాసిస్ ఎక్కువగా మోచేతులు, మెకాలు, తల, వీపు భాగాల్లో కనిపిస్తుంది. కాలిగోళ్లు, చేతిగోళ్లలోకి విస్తరిస్తుంది.

కారణాలు
ఆటో ఇమ్యూన్ కండీషన్ సొరియాసిస్‌కు కారణమవుతోంది. శరీరంలోని ఇమ్యూన్‌సెల్స్ పొరపాటున సొంత కణాలపై దాడిచేయడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతోంది. ఈ అబ్‌నార్మల్ రెస్పాన్స్ వల్ల అబ్‌నార్మల్‌గా కణాలు తయారవుతాయి. వంశపారంపర్యంగా ఈ సమస్య వచ్చే అవకాశం కూడా ఉంది. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఇలాంటి అటో ఇమ్యూన్ డిసీజెస్ ఉంటే వారి సంతానానికి సొరియాసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. స్ట్రెప్టోకాకల్ ఇన్‌ఫెక్షన్, మానసిక ఒత్తిడి కూడా సొరియాసిస్‌కు కారణమవుతుంటాయి.

రకాలెన్నో...
సొరియాసిస్‌లో పలు రకాలున్నాయి. వ్యక్తికి వ్యక్తికి లక్షణాలు మారుతుంటాయి. సొరియాసిస్ విస్తరించిన ప్రదేశం, వ్యాధి ఉన్న కాలాన్నిబట్టి లక్షణాలుంటాయి.

ప్లేక్ సొరియాసిస్ : ప్లేక్ సొరియాసిస్ అతి సాధారణంగా వచ్చే వ్యాధి. 9 నుంచి 10 శాతం మంది రోగులు ప్లేక్ సొరియాసిస్‌తో బాధపడుతుంటారు. ఎర్రని ప్యాచ్‌ల మాదిరిగా ప్లేక్స్ చర్మంపై ఏర్పడతాయి. గోకినపుడు దురద, మంట ఉంటుంది. చర్మం పొడిబారినపుడు చర్మంపై పగుళ్లు ఏర్పడటంతో పాటు, రక్తస్రావం అవుతుంది. కీళ్లపై ప్రభావం పడినపుడు కీళ్ల దగ్గర వాపు, నొప్పి ఉంటుంది.

గట్టేట్ సొరియాసిస్ : గట్టేట్ సొరియాసిస్ పిల్లలతోపాటు యువతీ,యువకుల్లో ప్రారంభదశలో వచ్చే వ్యాధి. ఈ వ్యాధి వైరస్, బాక్టీరియాల వల్ల వచ్చి శ్వాసకోశ సమస్య ఏర్పడుతుంది. తల,చేతులు, కాళ్లపై ప్యాచ్‌లు ఏర్పడుతుంటాయి. ఇన్‌వర్స్ సొరియాసిస్ : చంకలు, ఛాతీ భాగంలో చర్మం మడతలుగా మారి ప్యాచ్‌లు ఏర్పడుతుంటాయి. ఈ వ్యాధికి చికిత్స చేయడం కష్టం.

సెబోరిక్ సొరియాసిస్ : ఎర్రని ప్యాచెస్‌లు చర్మంపై ఏర్పడతాయి. చెవులు, భుజం, ముఖంపై ఎర్రని మచ్చలు ఏర్పడతాయి.

నెయిల్ సొరియాసిస్ : చేతికున్న గోళ్లు పసుపు పచ్చగా మారతాయి. వేళ్లపై ఉన్న చర్మంపై పొక్కులు ఏర్పడుతుంటాయి.

పస్టులార్ సొరియాసిస్ : ప్యాచెస్‌లలో పస్ చేరి పగులుతుంటాయి. చేతులు, కాళ్లపై ఈ వ్యాధి కనిపిపిస్తుంటుంది.

సొరియాటిక్ ఆర్థరైటిస్: ఈ వ్యాధి మూలంగా జాయింటులు బిగుసుకుపోవడం, నొప్పి ఉంటుంది. సొరియాసిస్‌తో దీర్ఘకాలంగా బాధపడుతున్న వారిలో సొరియాటిక్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సొరియాటిక్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న వారిలో 80 శాతం మందిలో సొరియాసిస్ గోళ్లలో కనిపిస్తుంది. సిమ్మెట్రిక్ సొరియాటిక్ ఆర్థరైటిస్ ఉన్న వారిలో శరీరంలో రెండు వైపులా ఒకే ప్రదేశంలో లక్షణాలు కనిపిస్తాయి. మల్టిపుల్ జాయింట్స్‌పై ప్రభావం ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ మాదిరిగా ఉంటుంది. వెన్నులో ఉన్నప్పుడు నడుం బిగుసుకుపోవడం, మెడపై మంటగా ఉండటం వంటి లక్షణాలుంటాయి. సొరియాసిస్ వ్యాధి ప్రభావం శారీరకంగానే కాకుండా మానసికంగా తీవ్ర ప్రభావం చూపుతుంది.

జంబుష్ సొరియాసిస్ : ఎరిథ్రోడెర్మిక్, పస్టులార్ సోరియాస్ వ్యాధుల లక్షణాలు జంబుష్ సొరియాసిస్ వ్యాధిగ్రస్థుల్లో కనిపిస్తుంటాయి. ఈ వ్యాధి సోకిన రోగికి జ్వరం,మజిల్స్ బలహీనపడటం, బరువు కోల్పోవడం, ప్రొటీన్ లాస్ లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి పెద్దవారిలో వస్తే ప్రమాదం పొంచి ఉంటుంది.

హోమియో చికిత్స
సొరియాసిస్‌కు హోమియో వైద్య విధానంలో చక్కని చికిత్స అందుబాటులో ఉంది. రోగనిరోధక శక్తిని పెంపొందించి, గ్రంథులను ఉత్తేజపరిచి, వ్యాధి కారకములను తగ్గించే విధంగా చికిత్స అందించడం ద్వారా సొరియాసిస్‌ను సమూలంగా తగ్గించవచ్చు. ఈ చికిత్సకణజాల స్థాయిలో పనిచేసి వ్యాధి నిరోధక శక్తిని సాధారణ స్థాయికి తీసుకుస్తుంది. గ్రాఫైటిస్, నేట్రంమూర్, లైకోపోడియం, సల్ఫర్, సెపియా, స్టెపిసాగరియా, బరేటా కర్బ్, ప్రాస్పరస్,పల్సటిల్లా వంటి మందులు సొరియాసిస్ చికిత్సలో బాగా ఉపయోగపడతాయి. వీటివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. వ్యాధి తీవ్రతను బట్టి చికిత్సా కాలం ఉంటుంది. నిపుణులైన హోమియో వైద్యున్ని సంప్రదించి చికిత్స తీసుకుంటే వ్యాధి పూర్తిగా తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది.

Tuesday, February 5, 2013

IBS (Irritable bowel syndrome)

ఐబిఎస్ కడుపులో సుడిగుండం

పెద్దపేగుల్లో జరిగే ఒక అతి ప్రకోపం, ఒక అసహజమైన ప్రేరణలే ఐబిఎస్ వ్యాధికి మూలం. దాతువుల్లో విషపదార్థాలు పేరుకుపోవడం ఈ సమస్యకు ఒక ప్రధాన కారణం. జీర్ణశక్తి తగ్గిపోవడం, పోషక పదార్థాల లోపాలు, నాడీవ్యవస్థ సమతుల్యత కోల్పోవడం, సహజ జీవన శైలికి విరుద్దంగా వెళ్లడం ఇతర కారణాలు. వీటన్నిటినీ మించి శరీరంలో ఓజస్సు (ఇమ్యూనిటీ) తగ్గిపోవడం ఒక కీలక కారణమవుతుంది. ఇది ప్రాణాలేమీ హరించదు. 

కానీ, జీవితాన్ని నరకతుల్యం చేస్తుంది. మౌలికంగా, శరీర వ్యవస్థలో జరిగే కొన్ని లోపాలు, ఉత్పన్నమయ్యే రసాయనాల వ్యత్యాసాలు కారణంగా ఉంటాయి. మానసిక ఒత్తిళ్లు కూడా ఈ సమస్యకు ఒక ప్రధాన కారణమే. జీర్ణాశయ సమస్యల్లో ఎక్కువ మందిని వేధించేది ఈ సమస్యే. పురుషుల కన్నా మూడు రెట్లు అధికంగా స్త్రీలు ఈ వ్యాధి బారిన పడతారు. మొత్తంగా చూస్తే మనదేశంలో 20 శాతం మంది ఈ వ్యాధితో సతమతమవుతున్నారు.

ఎవరిలో ఎక్కువ
తరుచూ ప్రయాణాలు చేసేవారు, విరామం లేకుండా ఎక్కువ గంటలు పనిచేసేవారు, భోజన వేళలు పాటించని వారు, కొవ్వు పదార్థాలు అధికంగా ఉండే ఫాస్ట్‌ఫుడ్స్ తినేవారు ఈ వ్యాధికి ఎక్కువగా గురవుతారు. అలాగే జీర్ణాశయ ఇన్‌ఫెక్షన్లకు గురైన వారు ఆ వెంటనే ఐబిఎస్‌కు గురయ్యే అవకాశం కూడా ఎక్కువే. ఈ సమస్యకు మానసిక కారణాలు కూడా ఎక్కువే. జీర్ణాశయం అన్నది మనిషి భావోద్వేగాలు ప్రతిధ్వనించే వేదిక. భావోద్వేగాల తీరును బట్టే పేగుల కదలికలు ఉంటాయి. ప్రతికూల కదలికలు ఉంటే వాటి ప్రభావం నోటినుంచి విసర్జక భాగం దాకా కనపడుతూనే ఉంటాయి.

ఎలా తెలుస్తుంది?
ఐబిఎస్‌లో ప్రధానంగా కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, మలబద్దకం, విరేచనం ఈ నాలుగు లక్షణాలూ కనిపిస్తాయి. మలబద్దకం, విరేచనం అనేది ఒకదాని తరువాత ఒకటిగా వేధిస్తూ ఉంటాయి. ఒక రోజు మలబద్దకంగానూ ఒకరోజు విరేచనాలు కావడం ఇలా అసహనాన్ని నింపుతాయి. వీటివల్ల రోజువారి కార్యక్రమాలన్నీ అస్తవ్యస్తం అవుతాయి. ఈ అస్తవ్యస్తత ముందు వ్యాధిగా మారుతుంది. ఆ వ్యాధి పలు సమస్యల సిండ్రోమ్‌గా మారుతుంది.

ఈ నాలుగు లక్షణాల్లో ఏదో ఒకటిగా దాదాపు అందరిలోనూ ఉంటాయి. కానీ, ఈ నాలుగూ కలగలిసి వేధించడమే ఈ ఐబిఎస్ ప్రత్యేకత. ఈ నాలుగే కాకుండా ఐబిఎస్ ఉపలక్షణాలుగా తేన్పులు, తరుచూ అపాన వాయువు విడుదల కావడం, జిగురు విసర్జన, రుచి తెలియకపోవడం, ఛాతీలో మంటగా అనిపించడం, వికారం, వాంతి భావన కలగవచ్చు. స్త్రీలలో ఇది రుతుక్రమం దెబ్బతినేందుకు కూడా కారణం కావచ్చు. కొంతమంది స్త్రీలలో మూత్రం విసర్జనపైన అదుపు లేకుండా పోవచ్చు. మరికొంత మంది స్త్రీలలో శృంగార సమయంలో నొప్పిరావచ్చు. పార్శ్వపు తలనొప్పి రావడానికి ఐబిఎస్ ఒక కీలక కారణమవుతుంది.

వీటితో పాటు కండరాల నొప్పులు, నిద్రలేమి, వెన్ను, పొట్టకింది భాగాల్లో నొప్పి రావచ్చు. దీర్ఘకాలికంగా ఈ సమస్య కొనసాగే వారిలో దిగులు, ఆందోళన, ఆత్మన్యూనత, ఆత్మనింద, ఆసహనం,కోపం, భయం వంటి మానసిక అవస్థలు కూడా ఏర్పడవచ్చు. మొత్తంగా చూస్తే ఇది పెద్దపేగులకో, చిన్నపేగులకో పరిమితమయ్యే సమస్య ఎంతమాత్రమూ కాదు. ఇది హార్మోన్ వ్యవస్థను, నాడీవ్యవస్థను,అలా సమస్త శరీర వ్యవస్థనూ దెబ్బ తీస్తుంది. తిన్నదంతా విసర్జనలో వెళ్లిపోవడంతో ఎంత మంచి ఆహారం తీసుకున్నా ఇమడక సప్తధావులూ క్షీణిస్తాయి. ఫలితంగా శరీరం చిక్కి శల్యమవుతుంది. ఈ క్రమంలో వ్యాధినిరోధక శక్తి తగ్గిపోయి శరీరం రోగాల నిలయమవుతుంది.

పరిపూర్ణ చికిత్స
వాస్తవానికి జీర్ణవ్యవ స్థలో గ్రహణి అనే ఒక విభాగం ఉంటుంది. ఇది తిన్న ఆహారాన్ని జీర్ణమయ్యేలా చేసి, పోషకాలను, వ్యర్థాలనూ విడదీసి, వ్యర్థాలను బయటికి పంపించే విభాగం. శరీరంలో అగ్ని సరిగా లేనప్పుడు ఈ ప్రక్రియలేవీ సరిగా జరగక «ధాతువుల్లో విషపదార్థాలు ఆమం పేరుకుపోతాయి. ఈ ఆమమే ఐబిఎస్ సమస్యకు అసలు కారణం. అందుకే ఆయుర్వేదం, విషమూలమైన ఆమాన్ని బయటికి పంపడం మీదే అమిత ంగా తన దృష్టిని నిలుపుతుంది.

అందుకు అవసరమైన అగ్నిని పెంచుతుంది. అగ్నిని పెంచితే సమస్త రోగాలూ సమసిపోతాయి. అగ్నిని పెంచడమే ప్రధాన లక్ష్యం అయినందువల్లే ఆయుర్వేదాన్ని ఆగ్నేయ చికిత్స అంటారు. అందులో భాగంగానే లంఘనం, ఆమహర చికిత్సలు చేస్తాం. ఆకలిని పెంచడానికి దీపన చికిత్సలు చేస్తాం. పంచకర్మ చికిత్సలు చేస్తాం. ఇవన్నీ అయ్యాక శరీరంలో పునరుత్తేజం నింపే మరికొన్ని చికిత్సలు చేస్తాం. ఇవన్నీ కలిసి ఐబిఎస్ సమస్యను సమూలంగా, శాశ్వతంగా తొలగించివేస్తాయి.

Monday, February 4, 2013

పసిపిల్లల కేన్సర్లను పసిగట్టడమే ముఖ్యం

కేన్సర్ అంటే అదేదో పెద్దవారిలో వచ్చే వ్యాధిగానే చాలా మంది భావిస్తారు. కానీ, అరుదుగానే అయినా పసిపిల్లలూ కేన్సర్ బారిన పడుతారు. పెద్దవారైతే ఆ కేన్సర్ తాలూకు బాధల్ని వెంటనే చెప్పగలుగుతారు. పిల్లల్లో ఆ శక్తి లేకపోవడం వల్ల సమస్య బాగా ముదిరిపోయే వరకు బయటపడే అవకాశం ఉండదు. తల్లిదండ్రులే ఆ సమస్యను గుర్తించాలంటే వారికి ఆ వ్యాధి లక్షణాల గురించి తెలియాలి. లక్షణాలను గుర్తించి వెంటనే డాక్టర్‌ను సంప్రదిస్తే సకాలంలో సరియైన చికిత్సలు ఇప్పించి తమ పిల్లల ప్రాణాలను రక్షించుకోవడం సాధ్యమవుతుందని అంటున్నారు కేన్సర్ నిపుణులు డాక్టర్ సిహెచ్ మోహన వంశీ. 

చిన్నపిల్లల్లో వచ్చే కేన్సర్లు పెద్ద వాళ్లల్లో వచ్చే కేన్సర్లతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటాయి. పెద్ద వాళ్లల్లో కేన్సర్‌రావడానికి వాతావరణం, ఇతర పరిస్థితులు, జీవన శైలి లోపాలు,అలవాట్లు జన్యుపరమైన మూలాలు ఇవన్నీ కారణాలైతే, చిన్నపిల్లల్లో వచ్చే కేన్సర్లలో అత్యధిక భాగం, జన్యుపరమైన అంశాలు, డిఎన్ఏ మార్పులే ప్రధాన కారణంగా ఉంటాయి. నిజానికి, కేన్సర్ చికిత్సలకు పెద్దవాళ్లకన్నా చిన్నపిల్లల శరీరాలే బాగా స్పందిస్తాయి. శరీరంలో విషపదార్థాలు ఎక్కువగా ఉన్నా వాటినుంచి బయటపడే సామర్థ్యం వారిలో ఎక్కువగా ఉంటుంది. వైద్య చికిత్సలకు ప్రత్యేకించి కీమోథెరపీకి పెద్ద వాళ్ల కన్నా చిన్నపిల్లలే బాగా తట్టుకుంటారు. లేత వయసే అయినా వారి శరీర కణజాలానికి ఆ శక్తి ఎక్కువగా ఉంటుంది.

సాధారణ లక్షణాలు
అన్ని కేన్సర్లలోనూ కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలో ఏ భాగంలోనైనా ఒక కణితి ఏర్పడటం లేదా వాపు రావడం, శరీరమంతా పాలిపోయినట్లు అనిపించడం, ఏ చిన్న దెబ్బ తగిలినా ఎర్రబారి బాగా కమిలిపోవడం ప్రధానంగా కనిపిస్తాయి. కొంతమంది పిల్లల్లో శరీరంలోని ఏదో ఒక భాగంలో నొప్పి రావడ ం, నడుస్తున్నప్పుడు నొప్పి అనిపించడం, పరుగెత్తలేకపోవడం లేదా కుంటుతూ నడవడం, ఒక మోస్తరు జ్వరం, ఆకలి త గ్గిపోవడం, బలహీనంగా మారడం, హఠాత్తుగా దృష్టిలోపాలు ఏర్పడటం, హఠాత్తుగా బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇవన్నీ కచ్ఛితంగా కేన్సర్ లక్షణాలే అని కాదు. కాకపోతే, ఈ లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్‌ను సంప్రదించడంలో నిర్లక్ష్యం చేయకూడదు.

లుకేమియా
చిన్నపిల్లల్లో కనిపించే కేన్సర్లలో 34 శాతం లుకేమియా కేన్సర్లే ఉంటాయి. ఇది తెల్లరక్తకణాల్లో వచ్చే కేన్సర్. తెల్లరక్తకణాలు మైలార్డ్ అనీ, లింఫాటిక్ అనీ రెండు రకాలుగా ఉంటాయి. ఈ రెండింటిలో వేటిలోనయినా లుకేమియా కేన్సర్ రావచ్చు. తెల్లరక్తకణాల సంఖ్య పెరగడమే ఇక్కడ సమస్య. ఈ కేన్సర్‌లో ఎముకలు, కీళ్ళల్లో నొప్పి ఉంటుంది. బాగా నీరసం ఉంటుంది. శక్తిహీనత, రక్తస్రావం, అతిచిన్నదెబ్బకే శరీరం కందిపోవడం, తరుచూ ఇన్‌ఫెక్షన్లు రావడం ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి. అయినా ఈ కేన్సర్ కీమో థెరపీతో బాగా అదుపులోకి వస్తుంది. కాకపోతే ఈ థెరపీని ఎక్కువ రోజులే తీసుకోవలసి ఉంటుంది. ఈ థెరపీని కూడా పిల్లలు బాగానే త ట్టుకుంటారు. పిల్లల్లో వచ్చే ఈ కేన్సర్లు 70 శాతంమందిలో పూర్తిగా నయమవుతాయి. ఇదే కేన్సర్ పెద్దవాళ్లలో వస్తే ఇంత శాతం ఉండకపోవచ్చు.

కేంద్రనాడీ వ్యవస్థలో వచ్చే కణుతులు
ఈ కణుతులు మెదడులో రావచ్చు లేదా వెన్నుపాములో రావచ్చు. ఈ కణుతులు పెద్దవారిలో అయితే, మెదడు ఉపరిభాగం (సెరెబ్రెల్)లో వస్తాయి. చిన్నపిల్లల్లో అయితే, మెదడు కింది భాగం (బ్రెయిన్ స్టెమ్) లో వస్తాయి. చిన్నపిల్లల్లో వచ్చే కేన్సర్లలో నాలుగోవంతు ఈ మెదడు కేన్సర్లే ఉంటాయి. ఈ కేన్సర్లలో తలనొప్పి, వికారం, వాంతులు, అస్పష్టమైన చూపు, లేదా ఒక వస్తువు రెండుగా కనిపించడం, మగతగా ఉండడం, తూగిపడటం లేదా బేలన్స్ లేకపోవడం, కణితి ఉన్న భాగాన్ని బట్టి, కీమోథెరపీ గానీ, రేడియో థెరపీ గానీ, లేదా సర్జరీ గానీ, ఇవ్వాల్సిరావచ్చు.

న్యూరోబ్లాస్టోమా
చిన్నపిల్లల్లో వచ్చే కేన్సర్లలో 7 శాతం ఇవే ఉంటాయి. ఈ కేన్సర్లు నాడీకణజాలంలో వస్తాయి. 5 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న వారిలోనే ఈ కేన్సర్లు ఎక్కువగా వస్తాయి. పదేళ్లుదాటిన వారిలో ఇవి రావడం చాలా అరుదు. ఇవి శరీరంలో ఏ భాగంలోనైనా రావచ్చు. కానీ ఎక్కువ మంది పిల్లల్లో ఇవి పొట్టలోనే వస్తాయి. కడుపు ఉబ్బరం, వాపు, నొప్పి రావచ్చు, ఎముకల్లో నొప్పి, జ్వరం, బరువు తగ్గడం, పొట్ట పెరిగి శరీరమంతా సన్నబడటం ఇవి ఈ కేన్సర్ లక్షణాలు. ఒక మోస్తరు జ్వరం రావడం కూడా ఈ వ్యా«ధి లక్షణాల్లో ఒకటి. ఈ వ్యాధికి సర్జరీగానీ, కీమోథెరపీ గానీ, అవసరం కావచ్చు. చాలా సార్లు ఈ రెండూ అవసరమవుతాయి. కేన్సర్‌ను గుర్తించడంలో ఆలస్యమైనప్పుడు ముందు కీమోథెరపీ ఇచ్చి ఆ తరువాత సర్జరీ చేయవలసి ఉంటుంది.

విల్మ్స్ ట్యూమర్
ఇవి కిడ్నీల్లో వచ్చే కేన్సర్లు. చిన్నపిల్లల్లో వచ్చే కేన్సర్లలో 5 శాతం ఇవే ఉంటాయి. ఇవి మూడు నుంచి నాలుగేళ్ల లోపు పిల్లలోనే వస్తాయి. 5 ఏళ్లు దాటిన వారిలో ఇవి రావడం చాలా అరుదు. ఈ కేన్సర్లలో పొట్టలో వాపు రావడం, నొప్పి కొద్దిపాటి జ్వరం, వికారం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం ప్రధానంగా కనిపించే లక్షణాలు. ఈ కేన్సర్‌కు సర్జరీయే ప్రధాన చికిత్స. కణితిని గుర్తించడంలో ఆలస్యమై, అప్పటికే అది బాగా పెరిగిపోయి ఉంటే, ముందు కీమోథెరపీ ఇవ్వడం ద్వారా కణితిని కుంచింపచేసి, ఆ తరువాత సర్జరీ చేయవలసి ఉంటుంది. అవసరమైతే ఆ భాగంలో రేడియేషన్ కూడా ఇవ్వవలసి ఉంటుంది.

లింఫోమా
లింఫ్ గ్రంధుల్లో వచ్చే కేన్సర్లను లింఫోమా అంటారు. చాలా సార్లు ఈ కేన్సర్లు ఎముక మజ్జకు కూడా పాకుతూ ఉంటాయి. ఈ కేన్సర్‌లో కొద్దిపాటి జ్వరం, బరువు తగ్గడం, ఎక్కువగా చెమట రావడం, శరీరం పాలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. లింఫ్ గ్రంధులు రెండు రకాలు. అందులో ఒకటి హాచ్‌కిన్స్ లింఫోమా రెండవది నాన్‌హాచ్‌కిన్స్ లింఫోమా. హాచ్‌కిన్స్ లింఫోమా ఎక్కువగా 15 నుంచి 20 ఏళ్లలోపు వారిలో కనిపిస్తుంది. వీటిలో అత్యధిక శాతంపూర్తిగా నయమైపోయే కేన్సర్లు. ఇక నాన్‌హాచ్‌కిన్స్ లింఫోమాలు 5 ఏళ్లలోపు పిల్లల్లోనే ఎక్కువగా కనిస్తాయి. ఈ కేన్సర్ తీవ్రత కాస్త ఎక్కువే అయినా, కీమోథెరపీతో అదుపులోకి వస్తుంది. ముక్కపరీక్ష చేసి, కేన్సర్ ఏ స్టేజ్‌లో ఉందో తెలుసుకుని కీమోథెరపీ ఇవ్వవలసి ఉంటుంది.

ర్యాబ్డోమయో సార్కోమా
ఇది కండరాల్లో వచ్చే కేన్సర్. కండరాల్లో వాపు, నొప్పి రావడం. కండరాలు బలహీనమైపోవడం ఈ కేన్సర్‌లోని ప్రధాన లక్షణం. ఇవి కీమోథెరపీకి బాగా స్పందిస్తాయి. కొన్నిసార్లు రేడియేషన్, సర్జరీ కూడా అవసరం కావచ్చు.

రెటినోబ్లాస్టోమా
ఇవి కంట్లో (కనుపాప)వచ్చే కేన్సర్లు. చిన్నపిల్లల్లో వచ్చే కేన్సర్లలో ఇవి 3 శాతం కనిపిస్తాయి. సాధారణంగా 18 మాసాల నుంచి 3 ఏళ్ల లోపు పిల్లల్లో కనిపిస్తాయి. 6 ఏళ్లు దాటిన పిల్లల్లో ఇది పెద్దగా కనపడదు. ఈ కేన్సర్ సోకిన వారిలో కనుపాపలు నల్లగా కాకుండా మెరుస్తూ, పిల్లిక ళ్లలా కనిపిస్తాయి. మనం నేరుగా గుర్తించకపోయినా ఫోటోగ్రాఫ్‌లో ఆ కన్ను తెల్లగా మెరుస్తూ కనిపిస్తుంది. కనురెప్పల్లో వాపు కనిపిస్తుంది. కొందరిలో కనుగుడ్లు బయటికి ఉబ్బవచ్చు. ఈ కేన్సర్లకు కీమోథెరపీ, సర్జరీ అవసరమవుతాయి.

బోన్ కేన్సర్
ఎముకల్లో వచ్చే ఈ కేన్సర్లు బాల్యం నుంచి టీనేజ్‌దాకా ఎప్పుడైనా రావచ్చు అయితే ఇవి పెరగడం అన్నది ఏ వయసులోనైనా జరగవచ్చు. కొన్ని దఫాలుగా కీమో థెరపీ ఇచ్చి ఆ తరువాత సర్జరీ చేయడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ సర్జరీగా అనువుగా లేకపోతే, రేడియేషన్ ఇవ్వవలసి ఉంటుంది. కాకపోతే ఈ చికిత్స ఎక్కువ రోజులే తీసుకోవలసి ఉంటుంది.

సర్వైవల్ రేట్
లుకేమియా కేన్సర్‌లో 80 శాతం దాకా పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంది. బ్రెయిన్ ట్యూమర్లయితే 70 శాతం మందికి వ్యాధి నయమవుతుంది. హాచ్‌కిన్స్ లింఫోమాలో అన్నిటికన్నా ఎక్కువగా అంటే 95 శాతం మందికి పూర్తిగా నయమవుతుంది. విల్మ్స్ ట్యూమర్స్ 80 శాతం దాకా నమవుతుంది. మొత్తంగా చూస్తే సగటున చిన్నపిల్లల్లో వచ్చే కేన్సర్లలో 70 శాతం పూర్తిగా నయమవుతాయి. అయితే పిల్లలకు చికిత్స విషయంలో వివిధ శాఖలకు చెందిన డాక్టర్ల టీమ్ అవసరం అవుతుంది. పిల్లలకు కౌన్సెలింగ్ ఇవ్వడానికి ఒక సైకాలజిస్టు కూడా అవసరం.

కొన్ని ప్రతికూల ప్రభావాలు
రేడియేషన్, కీమోథెరపీ ఇచ్చిన పిల్లల్లో కొత్త విషయాలు నేర్చుకోవడంలో వెనుకబాటుతనం, ఐక్యూ తగ్గిపోవడం, చేతికీ కంటికీ మధ్య సమన్వయం లేకపోవడం, జ్ఞాపక శకి తగ్గిపోవడ ం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మెదడులో సహజంగా పలురకాల హార్మోన్లు ఉత్పన్నం అవుతాయి. రే డియేషన్ తరువాత ఈ హర్మోన్ వ్యవస్థ కొంత మేరకు దుష్ప్రభావానికి గురయ్యే ప్రమాదం ఉంది. అలాగే పిల్లల ఎదుగుదల కూడా కుంటుపడవచ్చు. రెటీనా బ్లాస్టోమా కారణంగా కంటికి రేడియేషన్ ఇచ్చినప్పుడు కొందరిలో దృష్టిలోపాలు ఏర్పడవచ్చు. 

కీమో థెరపీతోనూ మసకగా కనపించడం, ఒక వస్తువు రెండుగా కనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే మెదడుకు ఇచ్చే రేడియేషన్ వల్ల పిల్లలకు వినికిడి లోపాలు కూడా ఏర్పడవచ్చు. పెరుగుదల కుంటుపడిపోవడం, ఎముకల్లో కాల్షియం తగ్గిపోవడం, ఎముకల పెరుగుద ల కుంటుపడిపోవడం వంటివి కూడా ఉంటాయి. ఆ ప్రభావాలను గమనించిన వెంటనే డాక్టర్‌ను సంప్రదిస్తే, ఆ దుష్ప్రభావాలను కొంత మేరకు తగ్గించే అవకాశం ఉంటుంది. కేన్సర్ ట్రీట్‌మెంట్స్ జరిగింది అతి చిన్న వయసులోనే కాబట్టి వారి ముందు ఇంకా ఒక సుదీర్ఘమైన జీవిత కాలం ఉందని కదా! అందుకే ఈ కాలంలోనే కొంత మంది పిల్లల్లో రెండవసారి కేన్సర్ తలెత్తే అవకాశాలు ఉంటాయి. అందుకే దుష్ప్రభావాల కారణంగా పిల్లల్లో వచ్చే మార్పుల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండడం చాలా అవసరం. ఏవైనా ప్రతికూల మార్పులు కనిపించినప్పుడు వెంటనే సంబంధిత డాక్టర్‌ను సంప్రదించడం చాలా ముఖ్యం.

Tuesday, December 4, 2012

ఆయుర్వేదం సాధించిన అద్భుతం నడుమునొప్పి మాయం

చిన్న ప్రమాదంలో నడుముకు తగిలిన దెబ్బ నాలుగేళ్లు స్వాతిని వేధించింది. చూడని ఆర్థోపెడిక్ డాక్టర్ లేరు. తీయించని ఎక్స్‌రేలు, ఎంఆర్ఐ స్కానింగ్‌లు లేవు. నడుము నొప్పికి కిడ్నీలో రాళ్లు కూడా కారణం కావచ్చన్న అనుమానంతో మరికొన్ని స్కానింగ్‌లు. ఏ వైద్యానికి లొంగని ఆ నడుము నొప్పి నెల రోజుల్లోనే మటుమాయమైంది. ఇది ఆయుర్వేద వైద్యంలోని వైశిష్ట్యమని అంటున్నారు డాక్టర్ బుక్కా మహేశ్‌బాబు.

ఆమె పేరు స్వాతి. వయసు 28 సంవత్సరాలు. స్వస్థలం అమలాపురం. భర్త ఉద్యోగరీత్యా కర్నూలులో ఉంటున్నారు. వారికి ఒక నాలుగేళ్ల పాప. ఒకరోజు అమలాపురంలో భర్తతో కలసి బైక్ మీద వెళుతూ ప్రమాదవశాత్తు కింద పడింది స్వాతి. ఫ్రాక్చర్ లాంటిదేదీ కానప్పటికీ నడుం దగ్గర కొద్దిగా నొప్పి ఉండేది. మామూలు నొప్పే కదా తగ్గిపోతుందిలా అనుకున్నారామె. అయితే నెలరోజులైనా నొప్పి తగ్గలేదు సరికదా పెరుగుతూ పోతోంది. కర్నూలులో ఒక ఆర్థోపెడిక్ డాక్టర్‌ను ఆమె సంప్రదించారు. ఆయన రాసిన పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు క్యాప్సిళ్లను గుప్పిళ్లు గుప్పిళ్లు మింగినప్పటికీ ఎటువంటి ప్రయోజనం కనిపించలేదు. నొప్పి మాత్రం తగ్గలేదు.

నొప్పికి కారణం ఏమిటో తెలుసుకోవడానికి ఎంఆర్ఐ తీయించారు ఆ డాక్టర్. డిస్క్ కొంచెం తేడాగా ఉంది... అరిగినట్లు కనపడుతోంది...విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుందని చెప్పి బెల్ట్ వేసుకోమన్నారు ఆ డాక్టర్. ఇలా ఒక సంవత్సరం గడిచింది. విశ్రాంతి తీసుకున్నా, బెల్ట్ పెట్టుకున్నా నొప్పిలో మాత్రం మార్పు లేదు. సూదులతో పొడుస్తున్నట్లు వచ్చే నడుంనొప్పిని పంటి బిగువున భరిస్తూ ఇంటి పని, వంట పని చూసుకోవడం ఆమెకు నరకంగా మారింది. ఈ నొప్పి ఇంతేనా? జీవితాంతం భరించాల్సిందేనా? అన్న ఆవేదన ఆమెను చుట్టుముట్టేవి. ఆ సమయంలో మరో ఆర్థోపెడిక్ డాక్టర్‌ను సంప్రదించారు ఆమె. ఆయన సలహామేరకు మళ్లీ నడుముకు ఎక్సరేలు, ఎంఆర్ఐ స్కాన్‌లు అన్నీ తీయించారు.

నడుముకు స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వాలని చెప్పారు ఆ డాక్టర్. అయితే స్టెరాయిడ్ ఇంజెక్షన్ తీసుకోవద్దని ఆమె సన్నిహితులు సలహా ఇవ్వడంతో డాక్టర్ దగ్గర వెన్నులో ఇంజెక్షన్ తీసుకోకుండా కేవలం మందులు మాత్రం తీసుకున్నారు స్వాతి. నెల రోజులు మందులు వాడినా ఏ విధమైన ప్రయోజనం లభించలేదు. నిరాశా నిస్పృహలు ఆమెను ఆవహించాయి. జీవితం దుర్భరంగా మారుతోంది. ఈ క్రమంలో కర్నూలులో ఉన్న ఆర్థో డాక్టర్లు, సర్జన్లనందరినీ సంప్రదించారు స్వాతి. ఆయా డాక్టర్లు తమ అనుభవాన్నంతా రంగరించి తమకు తోచిన విధంగా చికిత్స చేశారు. ఇలా మూడు సంవత్సరాలు గడచిపోయాయి.

కొంతమంది డాక్టర్లు ఈ నొప్పి కిడ్నీలో రాళ్ల వల్ల వస్తున్నదేమో అన్న అనుమానంతో యూరాలజిస్ట్‌ని సంప్రదించవలసిందిగా ఆమెకు సలహా ఇచ్చారు. దాంతో యూరాలజిస్ట్‌ని కలిశారు. ఆయన దాదాపు 30 రకాల స్కానింగ్‌లు తీయించారు. కిడ్నీలో చాలా సూక్ష్మమైన రాళ్లు ఉన్నాయి...వాటి వల్ల ఇంత నొప్పి వచ్చే అవకాశం లేదు కాబట్టి బాగా నీళ్లు తాగమని, ఆ రాళ్లు వాటంతటవే కరిగిపోతాయని ఆమెకు సలహా ఇచ్చారు. బిందెల కొద్దీ నీళ్లు తాగినా ఎటువంటి ఫలితం కనిపించలేదు. నొప్పి యథాప్రకారం అక్కడే తిష్టవేసుకుని కూర్చుంది. కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఆర్థో సమస్య కాదనుకుని యూరాలజిస్ట్ దగ్గరకు వెళితే మళ్లీ ఆర్థో డాక్టర్‌నే కలవమని ఆయన సలహా ఇచ్చారు. సమస్య ఏమిటో తెలియకుండా తిరిగిన డాక్టర్ల దగ్గరకే మళ్లీ వెళ్లవలసి వచ్చినందుకు స్వాతిలో తీవ్రమైన ఆవేదన, నైరాశ్యం అలుముకున్నాయి.

దుష్ప్రభావాలు మొదలయ్యాయి...
డాక్టర్లు రాసిన మందులు ఎక్కువకాలం గుప్పిళ్ల కొద్దీ మింగడం వల్ల కడుపులో మంట, ఎసిడిటీ, గ్యాస్ పెరగటం, విపరీతంగా బరువు పెరగటం లాంటి దుష్ప్రభావాలు స్వాతిలో తలెత్తాయి. ఈ సైడ్ ఎఫెక్ట్స్‌ని తగ్గించుకోవడానికి చాలా డబ్బు ఖర్చుపెట్టి బరువు తగ్గించే మందులు కూడా ఆమె వాడారు. అయినా బరువు తగ్గలేదు... నడుము నొప్పీ పోలేదు. అసలు వ్యాధి ఏమిటో ఎన్ని ఎక్స్‌రేలు, ఎంఆర్ఐ స్కానింగ్‌లు, కిడ్నీ స్కానింగ్‌లు చేసినా నిర్ధారణ కాలేదు. అసలు వ్యాధి నిర్ధారణ జరిగేతేనే కదా ఔషధం పనితీరు ప్రభావం తెలిసేది! ఈ పరిస్థితుల్లో అంతిమ పరిష్కారంగా మొట్టమొదటిసారి ధైర్యం కూడగట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాలను వెదకడం ప్రారంభించారు ఆమె.

తమ కుటుంబ మిత్రుడొకరికి గుండుసూది కూడా మోపలేనంతగా శరీరమంతటా సొరియాసిస్ ఆవరించి ఉన్న పరిస్థితుల్లో ఆయుర్వేద మందులతో పూర్తిగా తగ్గిపోయిన విషయం ఆమె దృష్టికి వచ్చింది. వెంటనే ఆ మిత్రుడిని కలుసుకుని ఆయర్వేదం గురించి వాకబు చేశారామె. ఆ మిత్రుడు ఇచ్చిన సలహా మేరకు కర్నూలు నుంచి పయనమై నన్ను సంప్రదించారు ఆమె. నెలరోజుల క్రితం స్వాతి నా దగ్గరకు వచ్చినపుడు ఆమె చెప్పిన వ్యాధి లక్షణాలు ఇలా ఉన్నాయి.

వ్యాధి లక్షణాలు

- నడుములో కుడివైపు భాగంలో తీవ్రమైన నొప్పి.

- మెలిపెట్టినట్లు, గట్టిగా పిండినట్లు నడుములో నొప్పి.

- నొప్పి వచ్చినపుడు కుడికాలు పూర్తిగా స్పర్శను కోల్పోతుంది. అడుగు తీసి అడుగు వేయడం సాధ్యం కాదు.

- పద్మాసనం వేసుకుని కూర్చుంటే రెండు కాళ్లలో తిమ్మిర్లు.

- పాదాలు కింద పెడితే అరికాళ్లలో మంటలు.

- ఓ గంట సేపు కూర్చుని లేవాలంటే కాళ్లు సహకరించవు.

- నొప్పి ఉన్న వైపు పడుకుంటేనే ఉపశమనంగా ఉండేది.

- పడుకున్నపుడు అటు, ఇటు తిరగడానికి వీలయ్యేది కాదు.

- పడుకున్న తరువాత నిద్రలేవాలంటే కాళ్లు సహకరించేవి కావు. కాళ్లు స్వాధీనంలోకి రావడానికి అరగంట పట్టేది.

- తన సొంత పనులను కూడా చేసుకోలేని పరిస్థితి.

- మోకాలి పిక్కలు ఎవరో పిసికేసినట్టుగా నొప్పి వస్తుంది.

ఈ వ్యాధి లక్షణాలతో దాదాపు నాలుగైదు సంవత్సరాలుగా ఆమె బాధపడుతున్నారు.

వ్యాధి నిర్ధారణ ఇలా జరిగింది...
ఆమె శారీరక లక్షణాలను బట్టి ఈ వ్యాధిని కుడివైపు వచ్చే గృద్రసి వాత వ్యాధిగా నిర్ధారణ చేయడం జరిగింది. దీనితోపాటుగా ఇతరత్రా వివరాల కోసం ఎంఆర్ఐ రిపోర్ట్స్‌ను నిశితంగా పరిశీలించి వ్యాధి నిర్ధారణకు అవసరమయ్యే సమాచారాన్ని సేకరించడం జరిగింది. అతి సూక్ష్మమైన ఇసుకరేణువుల రూపంలో ఉన్న రాళ్లు కిడ్నీలో ఉన్నప్పటికీ నిరంతరం అతి తీవ్రమైన నడుమునొప్పి ఆ ప్రాంతంలో ఉండదు. అందుచేత ఆ అంశానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. కిడ్నీలోని రాళ్లు కరగడానికి ఒక ప్రత్యేకమైన ఆకును వండి తినవలసిందిగా సూచించడం జరిగింది. ఎంఆర్ఐలోని అంశాలు ఇలా ఉన్నాయి.

ఎల్3-ఎల్4, ఎల్4-ఎల్5 డిస్క్‌ల మధ్య నుంచి వచ్చే వెన్నుపాము నర్వ్ సిగ్నల్స్ తగ్గినట్లుగా తేలింది. ఇది చిన్న వయసులో ఎముకల అరుగుదల ఏర్పడటం వల్ల వచ్చే సమస్య. డి-12 వర్టిబ్రా నుంచి ఎల్-4 వర్టిబ్రా వరకు స్క్రూమోల్ కణుపులు అంటే వెన్నెముక చివరలో కొవ్వు గడ్డలాంటివి పెరగటం జరిగింది. ఎల్3-ఎల్4, ఎల్4-ఎల్5 మధ్యలో వెనుక భాగంలో డిస్క్ బల్జ్‌లు జరిగాయి. వెన్నుపాము వెళ్లేదారి ఇరుకై వెన్నుపాముపై పొరపై ఒత్తిడి పెరిగింది. ఇది ఎల్4-ఎల్5 మధ్య ఎక్కువగా ఉంది.

దీనికి తోడు రోగి మెడనొప్పితో బాధపడుతున్నప్పటికీ నడుము నొప్పి తీవ్రంగా ఉండటం వల్ల ఆ విషయానికి ఆమె అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. అయితే మెడ ప్రాంతంలోని సి2- సి3, సి4-సి5, సి5-సి6 ప్రాంతంలో వెన్నెముకల్లో అరుగుదల ఏర్పడినట్లు తేలింది. దీనివల్ల ఈ వెన్నెముకల వెనుక భాగంలో డిస్క్ బల్జ్‌లు ఏర్పడి వెన్నుపాము పైపొరపై ఒత్తిడిని కలుగచేస్తున్నాయి. దీనిని డీ జనరేటివ్ సర్వైకల్ డిస్క్ డిసీజ్ అంటారు.

ఇంకో అతి ముఖ్యమైన విషయం నడుము నిటారుగా నిలబెట్టడానికి అవసరమయ్యే లిగమెంటమ్ ఫ్లేవమ్ పట్టుజారి డి10 వర్టిబ్రా ప్రాంతంలో వెన్నుపాముపైన, వెన్నుపాము పైపొరపైన ఒత్తిడి కలుగచేస్తోంది. ఎంఆర్ఐ రిపోర్ట్స్‌ను సమగ్రంగా పరిశీలించిన తర్వాత పేషెంట్ వాహనం మీద నుంచి పడటం వల్లనే వెన్నుకు దెబ్బతగలడం వల్ల సమస్య ఇంత తీవ్రతరం అయ్యిందని కచ్ఛితమైన నిర్ధారణకు రావడం జరిగింది. అనంతరం చికిత్స ప్రణాళికను రూపొందించడం జరిగింది. మొట్టమొదటిగా చెదిరిన డిస్క్‌లు, సాగిన ఫ్లేవమ్ లిగమెంట్లను సరిచేసి వెన్నుపాముపై ఒత్తిడి తగ్గడానికి, నొప్పి తగ్గడానికి కావలసిన ఔషధాలను, వాటి డోసేజ్‌లను నిర్ధారించుకుని చికిత్స మొదలు పెట్టాము.

చికిత్సా విధానం ఇలా ఉంది...
వ్యాధి నిర్ధారణ, ఔషధాల ఎంపిక, వాటి డోసేజ్‌ల పరిమాణం, అవి వాడే విధివిధానం, ఏమేమి సలహాలు, సూచనలు పాటించాలి, చికిత్సలో మెరుగైన ఫలితాలు చికిత్సలో మెరుగైన ఫలితాలు పొందడానికి అతి ముఖ్యమైన అంశాలు. ఈ రోగి విషయానికి వస్తే సాధారణంగా అందరూ చెప్పే పథ్యాలైన వంకాయ, గోంగూర, దుంపకూరలు, సెనగపిండి లాంటివి తినవద్దని సూచించలేదు. కేరళ వైద్యం లాంటి మసాజ్‌లు కూడా ఏమీ చెప్పలేదు. మేము చేపట్టిన చికిత్సలో తైలమర్ధనలు అన్న ప్రయోగమే లేదు.

చెదిరిన డిస్క్‌లు సరిచేయడానికి, సాగిన లిగమెంట్ మామూలు స్థితికి రావడానికి, ఎముకల అరుగుదల సరిచేయడానికి ప్రాచీన కాలంలోనే ఆయుర్వేద సిద్ధ శాస్త్రవేత్తలు కనిపెట్టిన అత్యంత సూక్ష్మ ఔషధాలను(నానో) ఉపయోగించాము. ఇవి అత్యంత ప్రభావశీలమైన ఔషధ గుణాలతో కూడిన ఆకులు, బెరడులు, గింజలు, వేర్లు, జిగుర్లు, శుద్ధి చేసిన ఖనిజ భస్మాలతో తయారుచేసిన ఔషధాలు. నిరపాయకరమైన ఈ ఔషధాలు శరీర జీవ క్రియను మెరుగుపరచి, అత్యంత సూక్ష్మమైన కణాలలోకి కూడా బయో మాలిక్యూల్స్‌ను తీసుకువెళతాయి. రోగికి నెలరోజులకు అవసరమైన ఔషధాలను చికిత్సగా అందచేయడం జరిగింది.

చికిత్సా ఫలితం
నాలుగు వారాలపాటు ఔషధాలను వాడిన స్వాతికి అద్భుతమైన ఫలితాలు కనిపించాయి. నాలుగేళ్లుగా పట్టిపీడిస్తున్న నడుము నొప్పి పూర్తిగా మాయమైపోయింది. నాలుగడుగులు నడవడానికే కష్టపడే ఆమె ఇప్పుడు నాలుగు గంటలసేపు నిలబడి వంటచేయగలుగుతోంది. కాళ్లలో వచ్చే తిమ్మిర్లు తగ్గిపోయాయి. ఏ ఆసరా లేకుండానే చకచకా నడవగలుగుతోంది.

కూర్చున్నా, లేచినా, నిలబడినా వేధించే నొప్పి ఇప్పుడు లేనేలేదు. నిద్రించే సమయంలో అటు, ఇటు తిరగడం ఇప్పుడు సులువైంది. నిద్ర లేచిన వెంటనే సొంత పనులే కాక ఇంటి పనులు కూడా చేయగలుగుతోంది. ప్రశాంతంగా నిద్రించడంతోపాటు బరువు కూడా తగ్గడం మొదలైంది. మరో రెండు నెలల పాటు ఔషధ చికిత్సను కొనసాగించడం వల్ల నడుము నొప్పి ఇతర సమస్యలన్నీ కూడా ఆమెకు శాశ్వతంగా దూరమైపోవడం ఖాయం.

నాలుగేళ్లుగా పట్టిపీడిస్తున్న నడుము నొప్పి పూర్తిగా మాయమైపోయింది. నాలుగడుగులు నడవడానికే కష్టపడే ఆమె ఇప్పుడు నాలుగు గంటలసేపు నిలబడి వంటచేయగలుగుతోంది. కాళ్లలో వచ్చే తిమ్మిర్లు తగ్గిపోయాయి. ఏ ఆసరా లేకుండానే చకచకా నడవగలుగుతోంది.

Saturday, December 1, 2012

హెచ్‌ఐవీ వైరస్... తెలివితేటలు!

హెచ్‌ఐవీ వైరస్ చాలా తెలివైనది. అది శరీరంలోకి ప్రవేశించాక రోగనిరోధకశక్తిని ఇచ్చే సీడీ-4 సెల్స్‌ను నాశనం చేయడం పాటు తన సంతతిని వృద్ధి చేసుకుంటుంది. యాంటీ రెట్రోవైరల్ (ఏఆర్‌డీ) మందులు సీడీ-4 సెల్‌కౌంట్‌ను తగ్గకుండా చూస్తాయన్నమాట. ఈ వైరస్ ఎంత తెలివైనదంటే ఒకరకం మందులకు అలవాటు పడ్డ తర్వాత ఆ మందుకు తన నిరోధకశక్తి (రెసిస్టెన్స్) ని పెంచుకుంటుంది. తద్వారా తనను తాను (కాపీ చేసుకోవడం ద్వారా) వృద్ధి చేసుకోవడం మళ్లీ ప్రారంభిస్తుంది. అందుకే దాన్ని తప్పుదారి పట్టించేందుకు మూడు రకాల ఏఆర్‌వీ మందులు ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేయడం ద్వారా అది ఏ మెడిసిన్ పట్లా తన నిరోధకశక్తిని పెంపొందించుకోకుండా చేయవచ్చు.

హెచ్‌ఐవి - జానకి......

జానకిలాంటి వాళ్లందరికీ ఎయిడ్స్ డే సందర్భంగా అభినందనలు

జబ్బు నుంచి విముక్తి పొందడం కన్నా
సమాజం నుంచి విముక్తి పొందడం కష్టం.
భయం, అనుమానం, అవమానం, నిషేధం... వంటి క్రూరమైన ఆయుధాలతో సమాజం కొందరిని బాధ పెడుతుంది.
నువ్వు అక్కర్లేదు పో అని తరిమికొడుతుంది.
ఎదరించి నిలవడం, పోరాడి జీవించడం చాలా కష్టం.
కాని- జానకి సాధించింది. తనను మొదట ఒక మనిషిగా, ఆ తర్వాత హెచ్‌ఐవి బాధితురాలిగా యధాతధంగా గుర్తించే స్థితికి చేరుకుంది. తనకూ గౌరవప్రదంగా జీవించే హక్కు ఉందని నినదించింది. తనలాంటి వాళ్లకు అదే స్థాయిభరోసాను ఇచ్చే స్థాయికి ఎదిగింది.

జానకి వయసు 35 ఏళ్లు. హైదరాబాద్ వనస్థలిపురంలో తమ్ముడి కుటుంబంతో కలిసి ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం అక్కడి నుంచే హైదరాబాద్ లోని ఓ ఆర్గనైజేషన్‌కు చేరుకుంటుంది. అక్కడకు వచ్చిన హెచ్‌ఐవి బాధిత గుండెల్లో ధైర్యం నింపుతుంది. అన్నిం టి కంటే మించి వాళ్లకు నవ్వడం నేర్పుతుంది. నవ్వడం మర్చిపోయేంత భయంకరమైన నేరం వారేం చేశారని? అడిగితే- ‘‘ఎనిమిదేళ్ల కిందట నవ్వడం మానేశాను. హెచ్‌ఐవి సోకిందని తెలిసి నేడో రేపో చావు ఖాయం అనుకున్నాను. కాని, ఇవాళ ఎంతోమంది హెచ్‌ఐవి బాధిత కళ్లల్లో వెలుగులు నింపుతూ సంతృప్తిగా జీవిస్తున్నాను’’ అంది జానకి. ఆమె కథనం ఆమె మాటల్లో...

‘‘మా అమ్మనాన్నలకు నలుగురం ఆడపిల్లలం. ఒక మగపిల్లాడు. పద్దెనిమిదేళ్ల వయసులో మేనత్త కొడుకుతో పెళ్లయింది. ఆయన ముంబయ్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. అక్కడ అత్తమామ, ఇద్దరు మరుదులున్న ఉమ్మడి కుటుంబంలో ఏడేళ్లపాటు సంసారం సజావుగా సాగిపోయింది. ఏ ఒడిదొడుకులు లేవనుకున్న ఇంట్లో ఓ రోజు మా ఆయన జబ్బు కలకలం రేపింది. జ్వరం తగ్గుతున్నట్టే ఉండేది. మళ్లీ వచ్చేది. మెడికల్ షాపుల నుంచి మందుబిళ్లలు తెచ్చి వేశాం. తగ్గలేదు. డాక్టర్ల చుట్టూ తిరిగాం. వారు చెప్పిన మందులు వాడాం. వారం రోజుల్లోనే మనిషి బాగా నీరసించిపోయాడు. విపరీతమైన దగ్గు. దీంతో గవర్నమెంట్ ఆసుపత్రిలో చేర్పించాం. అక్కడ పరీక్షించిన డాక్టర్లు మా అత్తమామలకు ఏం చెప్పారో తెలియదు. కాని, మళ్లీ వస్తామని చెప్పి వెళ్లిన వారు ఆసుపత్రి వంక రావడమే మానేశారు. ఏం జబ్బు అని నర్సులను అడిగితే హెచ్‌ఐవి అన్నారు. ఆ జబ్బు ఏమిటో ఎందుకు వస్తుందో నాకు తెలియదు. డాక్టర్లు చూస్తున్నారు, మందులు వాడుతున్నాం, తగ్గిపోతుందిలే అనుకున్నాను. చంటిపిల్లాడికి మల్లే సపర్యలు చేశాను. కాని, మనిషి దక్కలేదు. పదిరోజులైనా కాకముందే... నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్లిపోయాడు.’’

వెంటాడిన తప్పు..

‘‘ఎనిమిది రోజులకే ఎనభై ఏళ్లకు సరిపడా నరకం అనుభవించాననిపించింది ఆ ఆసుపత్రిలో. మా అమ్మనాన్నలకు ఈ విషయం తెలిసి వచ్చారు. వారికీ ఈ జబ్బు గురించి ఏమీ తెలియదు. మా అత్తమామతో గొడవపెట్టుకున్నారు. మా అత్త- కొడుకే పోయాడు, కోడలు మాత్రం ఎందుకు అనడంతో పుట్టెడు దుఃఖాన్ని గుండెలో పెట్టుకొని అమ్మనాన్నలతో కలిసి హైదరాబాద్ వచ్చేశాను. ఏడాది తర్వాత ఉన్నట్టుండి నాకూ దగ్గు, ఆయాసం, జ్వరం మొదలయ్యాయి. సాధారణంగా వచ్చే సమస్యలే కదా అనుకొని కొన్నాళ్లు ఇంటి జాగ్రత్తలే పాటించాను. కాని లాభం లేకపోయింది. ప్రైవైట్ డాక్టర్లను సంప్రదించాను. ఏడాది పాటు ఎవరేం చెప్పినా ఆ మందులన్నీ వేసుకున్నాను. కాని అవేవీ పనిచేయలేదు. బరువు ఇరవై కేజీలకు పైగా తగ్గిపోయాను. నా ఒంటిరంగు, జుట్టు రంగూ మారిపోయాయి.

ఓ డాక్టర్ సలహా మేరకు ఎర్రగడ్డలోని చెస్ట్ ఆసుపత్రిలో చేరాను. అక్కడ టెస్టులు చేసి, హెచ్‌ఐవి పాజిటివ్ అని చెప్పారు. అప్పుడు నా వయసు 27. బరువు 27. సిడి4 కౌంట్ 27. (ఆరోగ్యంగా ఉన్నవారిలో సిడి4 కౌంట్ 500పైగా ఉంటుంది. హెచ్‌ఐవి ఉన్నవారి లో ఈ కౌంట్ 350 కన్నా తగ్గితే ప్రమాదమని వైద్యులు చెబుతారు) సిడి4అంటే ఏంటో, హెచ్‌ఐవి అంటే ఏంటో అది ఎందుకు వస్తుందో తెలియదు. కాని అనారోగ్య కారణంగా పడే బాధలను తట్టుకోలేక చచ్చిపోతానా... అనిపించేది. మా ఆయన వల్లే ఈ జబ్బు నాకు సంక్రమించిందని అప్పుడూ తెలియలేదు. చెస్ట్ ఆసుపత్రి డాక్టర్లు ఉస్మానియా హాస్పిటల్‌లోని ఎఆర్‌టి సెంటర్‌కి రాశారు. అక్కడ వాళ్లు ఈ జబ్బు గురించి కొంత చెప్పారు. కాని అంతా గందరగోళంగా, భయం భయంగా అనిపించింది. ఈ జబ్బు ఎంత భయంకరమైనదో మెల్ల మెల్లగా తెలిసొచ్చింది.’’

సైడ్ ఎఫెక్ట్స్...

‘‘డాక్టర్లు ఇచ్చిన మందులు వేసుకుంటే ఒక బాధ, వేసుకోకపోతే ఒక బాధలా అయ్యింది నా పరిస్థితి. చాలా పవర్ ఉన్న ట్యాబ్లెట్లు అవడం వల్ల కడుపులో అల్సర్లు వచ్చాయి. విపరీతమైన మంట. బాధను తట్టుకోలేక విలవిల్లాడుతూ అరుస్తుంటే మా అమ్మ ఇంటి బయటకు వెళ్లిపోయి ఏడుస్తూ కూర్చునేది. ఇదేమి జబ్బో అని నన్ను తాకడానికి కూడా భయపడేది. రాత్రుళ్లు ఇంట్లో ఎవరికీ నిద్రలే ఉండేవి కావు. నా కంచం, మంచం, గ్లాసు, సబ్బు... అన్నీ వేరయిపోయాయి. మా చెల్లెళ్ల పిల్లలను దగ్గరకే రానిచ్చేవారు కాదు. ఇంట్లో ఈ తేడా నన్ను మరింతగా కుంగదీసింది. ఇవి చాలదన్నట్టు ఆ మందుల ఎఫెక్ట్‌కి చూపులో తేడా వచ్చింది. ఎడమకన్ను పూర్తిగా చూపు కోల్పోయింది. వీపు మీద పెద్ద కణతి ఏర్పడింది. ఇన్ని సమస్యలను తట్టుకుంటూ ఇంకా బతకడం అవసరమా అని ఏడ్వని రోజు లేదు.’’

బతుకుపై బరోసానిచ్చింది ఓ  సంస్త ...

‘‘మందుల ప్రభావానికి శరీరం అలవాటు పడటం మొదలుపెట్టింది. ఎ.ఆర్.టి సెంటర్ వాళ్లు ఇచ్చే సూచనలు పాటించాను. అక్కడే ఓ అనే ఎన్.జి.ఓ సంస్థ గురించి తెలిసింది. అక్కడ నాలాంటి వారికి ఎన్నో సహాయసహకారాలు అందిస్తున్నారిని తెలిపింది. నా సమస్య నేనే పరిష్కరించుకోవాలని బెరుకుబెరుగ్గానే ఆ  సంస్థ సభ్యులను కలిశాను. నాకొచ్చిన సమస్య చెప్పాను. ‘ఇక్కడ ఉన్నవారంతా హెచ్‌ఐవి బాధితులే. భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తలతో వ్యాధిని నియంత్రణలో పెట్టుకోవచ్చు. అన్నింటికన్నా కావల్సింది మనోధైర్యం’ అని చెప్పారు వాళ్లు. అక్కడికెళ్లినప్పుడు ఎంత భయపడ్డానో, వారిచ్చిన కౌన్సెలింగ్ వల్ల అంత ధైర్యం వచ్చింది. పర్వాలేదు ఉన్నన్నాళ్లూ ఆరోగ్యంగా బతకగలను అనే నమ్మకం వచ్చింది.

పోషకాలు గల ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా ఎయిడ్స్ మందులు వాడటం, రోజూ ఏదో రకంగా ఆ  సంస్థ సభ్యులను కలుసుకోవడం చేశాను. అలా తొందరగానే కోలుకోగలిగాను. నాలాంటి హెచ్‌ఐవి బాధితులకు కౌన్సెలింగ్ చేయాలనుకున్నాను. అదే విషయం  సంస్థ సభ్యులకు చెప్పి, వారి సహకారంతో కౌన్సెలింగ్ చేయగలిగే స్థాయికి ఎదిగాను. ఇప్పుడు ఆ సాయం నాలో ఎనలేని సంతృప్తిని నింపుతోంది. పిల్లలులేని నేను ఓ పాపను పెంచుకుంటున్నాను. ఇప్పుడా పాపకు ఏడేళ్లు. ఆ పాప భవిష్యత్తులోనే నా ఆనందాన్ని వెతుక్కుంటున్నాను’’ అని ముగించారు జానకి.

చావే పరిష్కారం అనుకునే ఎంతో మంది హెచ్‌ఐవి బాధితులకు మరణం అంచుల దాకా వెళ్లొచ్చిన జానకి కథనం ఓ ఆదర్శం. హెచ్‌ఐవి సమస్యను అధిగమించడానికి ఎంతోమంది అమాయకులకు కావలసిన మనోధైర్యాన్ని ఇవ్వగలిగే స్థాయికి చేరుకున్న జానకిలాంటి వాళ్లందరికీ ఎయిడ్స్ డే సందర్భంగా అభినందనలు తెలుపుదాం.

హెచ్‌ఐవి బాధితులు మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు. సంసారజీవితాన్ని సరైన జాగ్రత్తలతో సుఖసంతోషాలతో గడపవచ్చు. నన్నూ పెళ్లి చేసుకోమని కొంతమంది సూచించారు. కాని పెళ్లి చేసుకో వాలనే ఆలోచన నాకు లేదు. ఎందుకంటే జీవితంలో నాకో దిశ కనిపించింది. గమ్యం ఏంటో అర్థమైంది. అందుకే నాలో ధైర్యాన్ని నింపిన  ఆర్గనైజేషన్‌లోనే కౌన్సెలర్‌గా చేరాను.
- జానకి

Friday, November 30, 2012

మన ఆహారం... మన గొప్పదనం...

(ఇండియన్ డైటేటిక్ అసోసియేషన్ స్వర్ణోత్సవాల సందర్భంగా ‘భారత ఆహారాలు-ఆరోగ్యం’పై సెప్టెంబర్ 29 నుంచి డిసెంబర్ 1వరకు హైదరాబాద్‌లో సదస్సు జరుగుతున్న నేపథ్యంలో...)

తిండి కలిగితే కండ గలదోయ్... అన్నాడు మహాకవి గురజాడ. పనిచేయాలంటే తగినంత శక్తి ఉండాలి కదా... అయితే పనిచేయడానికి మాత్రమే కాదు మనిషి మూర్తిమత్వాన్ని, వ్యక్తిత్వాన్ని, వ్యవహారశైలిని కూడా తినే తిండి నిర్దేశిస్తుందని మన వేదాలు ఘోషిస్తున్నాయి. మనిషి వ్యవహారశైలి, పని స్వభావంపై ఆహారం ప్రభావం చూపిస్తుందని భగవద్గీతలో ప్రస్తావన ఉంది. ఆహారం మెదడుపైన ప్రభావం చూపిస్తుంది కనుకనే మనలో సత్వ, రజో, తమో గుణాలు ప్రేరేపణకు గురవుతుంటాయి. మన న్యాయశాస్త్రంలోనూ ఆహార పదార్థాల గురించిన వివరణ ఉంది. ద్రవ్య, గుణ, కర్మ, సామాన్య, విశేష, సమావయ, అభవ పదార్ధాలుగా వాటిని వివరించారు. అందుకే వేదకాలానికి పూర్వం నుంచే అన్నం పరబ్రహ్మ స్వరూపమైంది.

వ్యాధులు, ఆరోగ్యంలో ఆహార పదార్ధాల పాత్రపై మన పూర్వీకులకు పూర్తి అవగాహన ఉండేది. ఉప్పు అధికంగా తీసుకంంటే వచ్చే ఎగ్జిమా, అసిడిటీల గురించి, స్వీట్లు ఎక్కువ తింటే పెరిగే కఫ దోషాల గురించి వారికి అనాడే తెలుసు. వాటికి విరుగుడుగా మంచి ఆహార అలవాట్లను, దోషనివారణకు అనువైన సాంప్రదాయ వైద్య ప్రక్రియలను అనాడే అభివృద్ధి చేసుకున్నారు. కానీ కాలం మారింది. నేడు కొత్త తరం ఆహార పదార్ధాలు వచ్చేశాయి. మనదేశంలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో ఆహార అలవాట్లలో విపరీతమైన మార్పులు వచ్చాయి. జీవన విధానమూ మారిపోయింది. సాంప్రదాయ భారత ఆహారం గింజధాన్యాలతో నిండి ఉండేది. దంపుడు బియ్యం స్థానంలో బాయిల్డ్ రైస్ వచ్చి చేరాయి. తెల్లబియ్యం వచ్చిన తర్వాత మిగిలిన రకాలను తినడమే మానేశారు.

గోధుమ పరిస్థితీ ఇంతే. చపాతీల స్థానాన్ని రిఫైన్డ్ గోధుమతో తయారయ్యే బ్రెడ్‌లు ఆక్రమించాయి. అమెరికన్లు, యూరోపియన్లు మన వంటకాలు నేర్చుకుని వాటిలో ఉన్న పోషక విలువలను తెలుసుకుని ఆశ్చర్యపోతుంటే భారతీయులు మాత్రం వారి పిజ్జాలు, బర్గర్ల వెంటపడుతున్నారు. జొన్నలు, సజ్జలు, రాగులను పూర్తిగా వదిలేశారు. ఇపుడు తింటున్న రిఫైన్డ్ ఆహారంలో చాలా రకాల విటమిన్లు, మినరల్స్ ఉండడం లేదు. దాంతో రోగనిరోధక శక్తి కనుమరుగైపోతున్నది. వ్యాధులు పెరిగిపోయాయి. వయసుతో నిమిత్తం లేకుండా గుండె సంబంధ వ్యాధులు, హైపర్‌టెన్షన్, ఊబకాయం, డయాబెటిస్ వంటివి దాడి చేస్తుండడానికి కారణం మనం తినే ఆహారమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మన శరీర తత్వాన్ని, మన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా అనేక వ్యాధుల బారి నుంచి తప్పించుకోవచ్చని వారు చెబుతున్నారు. సరిహద్దులో నిరంతరం దేశరక్షణ బాధ్యతలను చూస్తున్న సైన్యాన్ని ఇందుకు ఉదాహరణగా తీసుకోవచ్చు. వారు ఎడారిలో, కొండకోనల్లో, మైదాన ప్రదేశాలలో కాపలా కాస్తుంటారు. అందుకే వారి కోసం రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ప్రత్యేక ఆహారాన్ని అందిస్తున్నది. సైనికులు దేశాన్ని రక్షిస్తున్నట్టే మనమూ మన దేహాన్ని రక్షించుకోవాలి. ఈ విషయంలో మన పరిశోధనా సంస్థలు తీసుకుంటున్న జాగ్రత్తల నుంచి మనమూ పాఠం తీసుకోవాలి. మన ఆరోగ్యాన్ని, శరీరాన్ని దృష్టిలో ఉంచుకుని ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. అపుడే ఆరోగ్య భారత్ ఆవిష్కృతమవుతుంది.

- పి. తులసీకుమారి


Thursday, November 29, 2012

HIV......తల్లీ, బిడ్డా క్షేమం కోసం...

తల్లి నుంచి బిడ్డకు హెచ్‌ఐవీ వ్యాపించడాన్ని ‘మదర్ టు ఛైల్డ్ ట్రాన్స్‌మిషన్’ అంటారు. తల్లికి హెచ్‌ఐవీ ఉన్న ప్పుడు ప్రసవం ముందర కొద్దికాలంపాటు యాంటీ రిట్రోవైరల్ డ్రగ్స్ ఇవ్వాలి. ఇది ఎప్పుడు ఇవ్వాలి, ఏ మోతాదులో ఇవ్వాలి, ఏ సమయం వరకు ఇవ్వాలన్న అంశాన్ని డాక్టర్లు నిర్ణయిస్తారు. ప్రసవం తర్వాత పుట్టిన పాపకూ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక చనుబాల విషయానికి వస్తే, తల్లికి ఇన్ఫెక్షన్ ఉంటే బిడ్డకు చనుబాలు ఇవ్వకపోవడమే మంచిది.

తల్లి నుంచి బిడ్డకు హెచ్‌ఐవీ వ్యాపించకుండా ఉండేందుకు వాడే మందుల్లో నెవిరపిన్, జిడోవుడిన్ (దీన్ని ఏజడ్‌టీ అని కూడా అంటారు) అనే ఔషధాలు ఉంటాయి. తల్లికి హెచ్‌ఐవీ ఉందని గుర్తించడంలో ఆలస్యం జరిగి ప్రసవానికి కొద్దిరోజుల ముందే ఆ విషయాన్ని కనుగొంటే... హెచ్‌ఐవీ బిడ్డకు రాకుండా నివారించడం కోసం ‘నెవరపిన్’ వాడటం మినహా మార్గాంతరం లేదు.

దీనివల్ల పూర్తిగా నివారణ సాధ్యమవుతుందని చెప్పలేం. కానీ ముందు నుంచీ తీసుకునే చర్యల ద్వారా చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో తల్లి నుంచి బిడ్డకు వ్యాప్తిని నిరోధించడం సాధ్యమైంది. తద్వారా అక్కడ తల్లి నుంచి బిడ్డకు వ్యాప్తి చెందే అవకాశాలు కేవలం 1% కంటే కూడా తక్కువే. కాబట్టి ఇప్పుడు గర్భవతులకు ముందే పరీక్షలు నిర్వహించి హెచ్‌ఐవీ ఉందా లేదా తెలుసుకోవడం తప్పనిసరి అయ్యింది.

Tomorrow AIDS DAY

ఎయిడ్స్‌ను కనుగొన్ననాటి నుంచి ఇప్పటివరకూ చికిత్స లేని వ్యాధిగా ఇది తీవ్ర భయాందోళనలను, రోగుల పట్ల వివక్షనూ పెంచింది. ఇంతటి సంచలనాలకు కారణమైన ఈ వ్యాధిపై ఎన్నో అపోహలు, అనుమానాలు. వ్యాధిగ్రస్తులపై ఎన్నో ఆంక్షలు. అందుకే ఎయిడ్స్‌పై ప్రపంచవ్యాప్త అవగాహనను కలిగించడం తప్పనిసరై ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 1998 నుంచి డిసెంబరు మొదటితేదీని ‘ప్రపంచ ఎయిడ్స్‌దినం’ గా జరుపుకోవడం ప్రారంభమైంది. రేపు ప్రపంచ ఎయిడ్స్ డేసందర్భంగా హెచ్‌ఐవీ/ ఎయిడ్స్‌పై అవగాహన కలిగించేలా సమగ్రమైన ప్రత్యేక కథనం ఇది...

‘హ్యూమన్ ఇమ్యునో డెఫీషియెన్సీ వైరస్’కు ఇంగ్లిష్ సంక్షిప్తరూపమే ‘హెచ్‌ఐవీ’. ఈ వైరస్‌తో కలిగే ఇన్ఫెక్షన్ వల్ల మనకు వ్యాధినిరోధకశక్తిని ఇచ్చే కణాలు దెబ్బతిని (అంటే ప్రధానంగా సీడీ4 కణాలు, పాజిటివ్ టీ సెల్స్, మేక్రోఫేజెస్) రోగనిరోధకశక్తి క్రమంగా మందగిస్తూ ఒక దశలో అసలు వ్యాధినిరోధక వ్యవస్థే లేని పరిస్థితి వస్తుంది. దాంతో హెచ్‌ఐవీ ఉన్నవారికి ఏ చిన్నపాటి జబ్బు/ఇన్ఫెక్షన్ వచ్చినా... అది ప్రాణాపాయానికి దారితీస్తుంది.

హెచ్‌ఐవీని తెలుసుకోవడం ఎలా?

ఎయిడ్స్ అంటే ‘అక్వైర్డ్ ఇమ్యునో డెఫీషియెన్సీ సిండ్రోమ్’కి సంక్షిప్తరూపం. హెచ్‌ఐవీ సోకిన వారికి ముందుగా ఎలాంటి లక్షణాలూ బయటకు కనిపించవు. అసలు సోకినట్లే తెలియదు. కొద్దిమందిలో మాత్రం కాస్త టైమ్ గడిచాక వారిలో సీరోకన్వర్షన్ జరిగే సమయంలో (అంటే... వారిలో ఇన్ఫెక్షన్ కారణంగా వచ్చే మార్పులతో రక్తంలో యాంటీబాడీస్ ప్రవేశించేవేళ) ‘‘యాంటీ రెట్రోవైరల్ సిండ్రోమ్’’ అనే దశ కనిపిస్తుంది. ఇందులో జ్వరం రావడం, ఒళ్లంతా ర్యాష్, లింఫ్‌నోడ్స్ వాచడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సీరో కన్వర్షన్‌లో ఉండే ఈ లక్షణాలు ఇన్ఫెక్షన్ సోకిన 1 నుంచి 6 వారాల వరకు ఎప్పుడైనా కనిపించవచ్చు. ఆ సమయంలో ఒక వ్యక్తికి హెచ్‌ఐవీ నిర్ధారణకు రక్తపరీక్ష చేసి హెచ్‌ఐవీ యాంటీబాడీస్ ఉన్నాయా లేవా అని తెలుసుకోవడమే మార్గం. హెచ్‌ఐవీ సోకాక వేర్వేరు దశల్లో కనిపించే లక్షణాల ద్వారా అది ఏ దశలో ఉందో తెలుసుకోవచ్చు.

హెచ్‌ఐవీ లక్షణాలు...

జ్వరం, గొంతునొప్పి, తలనొప్పి, కండరాల నొప్పులు, కీళ్లనొప్పులు (ఈ లక్షణాలు రెండు వారాల పాటు ఉండవచ్చు) చర్మం కింద ఉండే కొన్ని శరీరభాగాల వాపు. ప్రధానంగా గొంతుభాగానికి ఇరుపక్కలా, బాహుమూలాల్లో ఉండే లింఫ్‌నోడ్స్ వాపు. (ఈ లక్షణం దీర్ఘకాలికంగా హెచ్‌ఐవీ తో బాధపడేవారిలోనూ కనిపిస్తుంది) ముఖం, మెడ, ఛాతీపై ర్యాష్.

దీర్ఘకాలంగా అంటే చాలా ఏళ్ల పాటు హెచ్‌ఐవీ ఉన్నప్పుడు:

జ్వరం, కడుపునొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, అకస్మాత్తుగా బరువు తగ్గడం ఇతర ఇన్ఫెక్షన్లు (ప్రధానంగా ఊపిరితిత్తుల, మెదడు, కంటి ఇన్ఫెక్షన్స్‌తో పాటు నోటిలో ఈస్ట్ ఇన్ఫెక్షన్ కచ్చి దాంతో నోరంతా చేదుగా ఉండటంతో పాటు తెల్లమచ్చలు రావడం)

ఇలాంటి దశలన్నీ దాటాక... రోగనిరోధకశక్తి క్రమంగా తగ్గుతూ ఏ చిన్నపాటి ఇన్ఫ్‌క్షనైనా ప్రాణాపాయానికి దారితీసే కండిషన్‌ను ఎయిడ్స్‌గా చెప్పవచ్చు.

హెచ్‌ఐవీ రోగితో వ్యవహరించగానే ఏం చేయాలి?

హెచ్‌ఐవీ సోకినవారితో సెక్స్‌లో పాల్గొనడం లేదా అలాంటి వారికి చికిత్స చేసే సమయంలో ఉపయోగించిన సూది ప్రమాదవశాత్తూ ఇతరులకు గుచ్చుకోవడం వంటివి జరిగినప్పుడు... తక్షణం డాక్టర్‌ను కలిసి పోస్ట్ ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్ చికిత్స తీసుకోవాలి. సోకినట్లు నిర్ధారణ కాకపోయినా... అంటే అనుమానం ఉండగానే తీసుకోవాల్సిన చికిత్స ఇదన్నమాట.

పోస్ట్ ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్ అంటే...?

హెచ్‌ఐవీ రోగులతో వ్యవహరించే సమయంలో అది ఏదైనా చర్య వల్ల మనకు సోకినట్లుగా అనుమానించగానే కొన్ని యాంటీరిట్రోవైరల్ మందులను వాడాలి. ఇలా ముందుజాగ్రత్తగా మందులు వాడటాన్ని పోస్ట్ ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్ అంటారు. అయితే దీనివల్ల నూరు శాతం ఇన్ఫెక్షన్ సోకదనే గ్యారంటీ లేదు. కాబట్టి ముందు జాగ్రత్త అవసరం. ఈ పోస్ట్ ప్రొఫిలాక్సిస్ ట్రీట్‌మెంట్ తీసుకోవడాన్ని రోగి నుంచి ఆరోగ్యకరమైన వ్యక్తికి సోకిందని అనుమానించిన 72 గంటల లోపే మొదలుపెట్టాలి. ఇక 28 రోజుల పాటు ఎలాంటి అంతరాయమూ లేకుండా దాన్ని కొనసాగించాలి.

చికిత్స ఎలా?

హెచ్‌ఐవీ సోకినవారికి రోగనిరోధకశక్తిని కలిగించేలా ‘యాంటీ రెట్రోవైరల్’ (ఏఆర్‌వీ) మందులు ఇస్తే... వాళ్ల జీవన వ్యవధి (లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ) కూడా మామూలు వ్యక్తుల్లాగే ఉంటుంది. ఈ ఏఆర్‌వీ మందులు వైరస్‌ను తనను తాను కాపీ చేసుకుంటూ వృద్ధి చెందడాన్ని, రోగనిరోధకశక్తిని కలిగించే సీడీ-4

సెల్స్‌ను దెబ్బతీసే శక్తిని హరిస్తాయి. ఇలా ఏఆర్‌వీ మందులు ఇవ్వడాన్ని యాంటీ రెట్రోవైరల్ డ్రగ్ థెరపీ అంటారు. ఈ ప్రక్రియలో భాగంగా ఏఆర్‌వీ మందులనే రెండు మూడింటిని కలిపి ఇస్తారు.

హెచ్‌ఐవీ వ్యాపించేదెలా?
సురక్షితం కాని సెక్స్ ద్వారా (యోని మార్గంలోనైనా, మలద్వారం సెక్స్, చాలా తక్కువ కేసుల్లో ఓరల్ సెక్స్ ద్వారా కూడా) ఒకరి నుంచి ఒకరికి హెచ్‌ఐవీ వ్యాపించవచ్చు

కలుషిత సిరంజ్‌లు, సూదులు లేదా ఇతరత్రా వాడిగా ఉండే వస్తువుల ద్వారా
తల్లికి హెచ్‌ఐవీ ఉంటే ప్రసవానంతరం బిడ్డకువచ్చే అవకాశం ఉంది. అలాగే హెచ్‌ఐవీ ఉన్న మహిళ ఇచ్చే చనుబాలతోనూ సోకవచ్చు

హెచ్‌ఐవీ ఉన్న వారి రక్తాన్ని ఎక్కించడం వల్ల.

ఈ కండిషన్లలో చికిత్స తప్పనిసరి...

హెచ్‌ఐవీ రోగుల్లో దానితో పాటు కొన్ని ఇరత వ్యాధులు ఉండే అవకాశం ఉంది. అవి...
హెచ్‌ఐవీ - అసోసియేటెడ్ నెఫ్రోపతి (హెచ్‌ఐవీ వల్ల వచ్చే కిడ్నీల వ్యాధి).

హెచ్‌ఐవీ - అసోసియేటెడ్ ఛేంజెస్ ఇన్ బ్రెయిన్ ఫంక్షనింగ్ (హెచ్‌ఐవీ కారణంగా మెదడు పనితీరులో మార్పులు రావడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు).

హెపటైటిస్ బి / హెపటైటిస్ సి.

టీబీ (ట్యూబర్క్యులోసిస్).

పై వ్యాధులు ఉన్నప్పుడు సీడీ కౌంట్‌తో నిమిత్తం లేకుండా చికిత్స తప్పనిసరి.

హెచ్‌ఐవీ ఎయిడ్స్‌గా మారే క్రమం ఇలా..

మన శరీరంలో ఉండే సీడీ-4 కణాలు రోగనిరోధకశక్తిని కలిగిస్తాయి. హెచ్‌ఐవీ ఆ సీడీ-4 కణాల సంఖ్య తగ్గిస్తుంది. హెచ్‌ఐవీ సోకిన తర్వాత ఎలాంటి చికిత్సా తీసుకోలేదనుకుందాం. అప్పుడు రోగనిరోధకశక్తి క్రమక్రమంగా తగ్గుతూ 10-12 ఏళ్ల తర్వాత ఏదైనా సాధారణ ఇన్ఫెక్షన్‌కూడా వెంటనే ప్రమాదకరంగా మారే పరిస్థితి వస్తుంది. అలాంటి స్థితిని ఎయిడ్స్ అంటారు. వైద్యపరిభాషలో చెప్పాలంటే సీడీ కౌంట్‌ను పరిగణనలోకి తీసుకుంటే అది 200/ఎంఎం క్యూబ్ కంటే తగ్గడం అన్నమాట. అప్పుడు రోగి ఏ సాధారణ ఇన్ఫెక్షన్‌తోనైనా ప్రమాదకరమైన పరిస్థితిలోకి వెళ్లే అవకాశం చాలా ఎక్కువ.

సెక్స్ ద్వారా వ్యాప్తిని నిరోధించడం ఎలా?
మీ భాగస్వామితో తప్ప ఇతరులతో సెక్స్‌లో పాల్గొనకుండా ఉండటం.

ఒకవేళ పాల్గొనాల్సి వస్తే పురుషులు కండోమ్ వాడటం. స్త్రీలు ఫిమేల్ కండోమ్ వాడటం.

కండోమ్ ఎంత సురక్షితం?
సెక్స్ ద్వారా వ్యాపించే వ్యాధులతో పాటు హెచ్‌ఐవీ వ్యాప్తిని నిరోధించడంలో కండోమ్ చాలా ప్రభావపూర్వకమైన పాత్ర పోషిస్తుంది. సెక్స్‌లో పాల్గొన్న ప్రతిసారీ దాన్ని సరైన రీతిలో ఉపయోగించాలి. సరిగా ఉపయోగించనప్పుడు అది సెక్స్ మధ్యలోనే జారిపోవడం, పగిలిపోవడం వల్ల వ్యాధుల నుంచి రక్షణ అవకాశాలు కూడా తగ్గిపోతాయి.

సున్తీ చేయించుకుంటే సోకదా?
సున్తీ చేయించుకున్నవారు హెచ్‌ఐవీ ఉన్న పార్ట్‌నర్‌తో సురక్షితం కాని సెక్స్‌లో (అంటే కండోమ్ లేకుండా) పాల్గొంటే హెచ్‌ఐవీ సోకే అవకాశాలు కాస్త తగ్గవచ్చు. అంతేగాని సున్తీ వల్లనే పూర్తి రక్షణ లభించడం మాత్రం జరగదు.

ఏయే చర్యల ద్వారా వ్యాప్తిచెందదు...?
షేక్‌హ్యాండ్ ఇవ్వడం ద్వారా

పొడి ముద్దుల వల్ల (ఒకరినుంచి ఒకరికి లాలాజలం వ్యాపించేలా పెట్టుకునే తడిముద్దుల వల్ల హెచ్‌ఐవీ వ్యాప్తిచెందుతుందని చెప్పేందుకు కూడా ఆధారాలేవీ లేవు. అయినప్పటికీ వీలైనంతవరకు తడిముద్దులను అవాయిడ్ చేయడమే మంచిది).

హెచ్‌ఐవీ ఉన్న రోగిని కాటేసిన దోమ ఇంకొకరిని కాటేయడం వల్ల.

హెచ్‌ఐవీ ఎక్కడ ఉంటుంది?
హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ సోకినవారిలో ఆ వైరస్ ప్రధానంగా శరీరంలోని ద్రవాల్లో ఉంటుంది. అంటే అది రక్తం, వీర్యం, మహిళల్లోనైతే యోనిద్రవాలు, చనుబాలలో ఉంటుంది.

ఇతరత్రా జాగ్రత్తలూ అవసరమే
మందులు క్రమం తప్పకుండా వాడటం.

బలవర్థకమైన ఆహారం, శుభ్రమైన నీరు తీసుకోవడం

వ్యక్తిగత పరిశుభ్రత పాటు పరిసరాల శుభ్రత

ఇన్ఫెక్షన్లకు కారణమయ్యేందుకు దోహదం చేసే చోట్లలో ఉండకుండా వాటిని అవాయిడ్ చేయడం.

Tuesday, November 27, 2012

స్వాప్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌పై అవగాహన కల్పిస్తే.. ...

‘కేర్’లో స్వాప్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ 
భిన్న మతాలకు చెందిన వారైనా.. బంధువులు కాకపోయినా.. కిడ్నీల మార్పిడికి సిద్ధపడ్డ జంటలు

 ‘రక్త’సంబంధం ఇద్దరి ప్రాణాలను నిలిపింది. సరికొత్త జీవితాన్ని ప్రసాదించింది. హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో రాష్ట్రంలోనే తొలిసారిగా ‘స్వాప్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్’(పరస్పర ఒప్పందంతో మార్పిడి) ద్వారా ఇద్దరు వ్యక్తులకు మూత్రపిండాలని అమర్చారు. సాధారణంగా ఎవరికైనా మూత్రపిండాలు అమర్చాలంటే.. ఆ వ్యక్తికి అవయవదానం చేసేవారు కుటుంబ సభ్యులై ఉండాలి లేదా వారి బంధువులైనా అయి ఉండాలి. లేదంటే కెడావర్ ఆర్గాన్ డొనేషన్ పద్ధతిలో భాగంగా క్లినికల్ డెత్(మరణశయ్యపై) అయిన వ్యక్తి నుంచి వాటిని తీసి ఇవ్వవచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఈ రెండు పద్ధతుల్లో కాకుండా రెండు బాధిత కుటుంబాలకు చెందిన దాతలు(భార్యలు) పరస్పర అవగాహనతో కిడ్నీలను దానం చేయడంతో వారి భర్తల ప్రాణాలు నిలిచాయి. 

జరిగిందిదీ.. 

కరీంనగర్‌కు చెందిన ఎంఏ బేగ్ మూత్రపిండాల వ్యాధితో గత కొంతకాలంగా కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పదేళ్ల క్రితం కిడ్నీ మార్పిడి చేయించుకున్న ఆయనకు మళ్లీ సమస్య వచ్చింది. అప్పట్లో బేగ్ తమ్ముడు కిడ్నీ ఇచ్చారు. ఈసారి బంధువులు మూత్రపిండం ఇవ్వడానికి ముందుకొచ్చినా అవి సరిపోలేదు. దీంతో బేగ్ భార్య అయేషా కిడ్నీ ఇవ్వడానికి ముందుకొచ్చారు. అయితే, బేగ్ బ్లడ్‌గ్రూపు బి పాజిటివ్ కాగా.. అయేషాది ఎ పాజిటివ్. దీంతో ఆ ప్రయత్నమూ విఫలమైంది. అయితే, ఇదే సమయంలో కేర్ ఆస్పత్రికి కిడ్నీ సమస్యతోనేహైదరాబాద్ బీహెచ్‌ఈఎల్ ప్రాంతానికి చెందిన దేవీదాస్ అనే వ్యక్తి వచ్చారు. 

దేవీదాస్ భార్య నిర్మల ఆయనకు మూత్రపిండం ఇవ్వడానికి అంగీకరించినా.. దేవీదాస్ రక్తం గ్రూపు ఎ పాజిటివ్ కాగా, భార్యది బి పాజిటివ్ అయింది. ఇద్దరి సమస్యా ఒకటే. విషయం తెలుసుకున్నారు. భర్తలను దక్కించుకోవడానికి ఇద్దరు దాతలు(నిర్మల, అయేషా) అంగీకారానికి వచ్చారు. నిర్మల భర్తకు అయేషా కిడ్నీ ఇచ్చేందుకు, అయేషా భర్తకు నిర్మల మూత్రపిండమిచ్చేందుకు ఒప్పుకున్నారు. వీరి ప్రతిపాదనను కేర్ ఆస్పత్రి వైద్యులు ప్రభుత్వానికి పంపించారు. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలపడంతో నవంబర్ 7న బేగ్, దేవీదాస్‌లకు విజయవంతంగా మూత్రపిండాల మార్పిడి చేశారు. శస్త్రచికిత్స అనంతరం ఇరువురి కిడ్నీల పనితీరు సాధారణంగానే ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. ఇప్పటి వరకూ ముంబై, ఢిల్లీ, కోల్‌కతాల్లో మాత్రమే ఇలాంటి మార్పిడి జరిగిందని, ఆంధ్రప్రదేశ్‌లో ఇదే మొదటిసారని ఈ ఆపరేషన్లలో పాల్గొన్న వైద్యులు తెలిపారు. ఈ శస్త్రచికిత్సలు నిర్వహించిన డా.రాజశేఖర్ చక్రవర్తి, డా.విక్రాంత్‌రెడ్డి, డా.కె.రామరాజు, డా.కె.ప్రసాదరాజు, డా.బి.వి.రామరాజుల బృందం కిడ్నీ మార్పిడి చేయించుకున్న కుటుంబాలతో కలిసి మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఈ విధానాన్ని ‘స్వాప్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్’ అంటారని చెప్పారు. దేశంలో ఏటా 4 లక్షల మందికి కిడ్నీ సమస్య వస్తోందని, కానీ 4 వేల మందికి మాత్రమే అవయవ మార్పిడి జరుగుతోందని వైద్యులు తెలిపారు. స్వాప్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌పై అవగాహన కల్పిస్తే.. మరింతమందికి కొత్త జీవితాన్నివ్వవచ్చని వైద్య బృందం పేర్కొంది.