Showing posts with label Telangaana. Show all posts
Showing posts with label Telangaana. Show all posts

Sunday, November 25, 2012

యుద్ధం చేద్దాం!

కాంగ్రెస్ 56 ఏళ్లుగా తెలంగాణను మోసం చేస్తోంది.. టీఆర్‌ఎస్‌ను విలీనం చేస్తే తెలంగాణ ఇస్తామన్నారు.. మళ్లీ వంకర బుద్ధి చూపించారు 
కాంగ్రెస్‌పై యుద్ధం ప్రకటిస్తున్నాం.. స్వీయ రాజకీయ అస్తిత్వంతోనే తెలంగాణ సాధ్యం 
వీధుల్లో పోరాడుతూనే.. రాజకీయశక్తిగా ఎదగాలి 
బాబు పాలనలో రిటైర్మెంట్లే.. రిక్రూట్‌మెంట్లు లేవు
మాకు రాజన్న, చంద్రన్న రాజ్యాలు వద్దు..
తెలంగాణ రాజ్యం కావాలి...
తెలంగాణ కోసం డప్పుకొట్టి దండోరా వాయించే నాయకత్వం కావాలి: కోదండరాం 


(సూర్యాపేట సమరభేరి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి):తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఆది నుంచీ మోసం చేస్తోందని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు ధ్వజమెత్తారు. కుక్కతోక వంకరలా ఆ పార్టీ బుద్ధి మారటం లేదన్నారు. అందుకే సూర్యాపేట సమరభేరితో కాంగ్రెస్‌పై యుద్ధం ప్రకటిస్తున్నట్లు స్పష్టంచేశారు. స్వీయ రాజకీయ అస్తిత్వం సాధించటం ద్వారానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమవుతుందన్నారు. ఉద్యమ సందర్భంలో పోరాడుతూనే రాజకీయ సందర్భంలో స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని సాధించుకోవటం ద్వారా ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను సిద్ధించుకోవాలని పిలుపునిచ్చారు. 

నల్లగొండ జిల్లా సూర్యాపేటలోని కొండేటి వేణుగోపాల్‌రెడ్డి సభా ప్రాంగణంలో ఆదివారం జరిగిన ‘తెలంగాణ సమరభేరి’లో కేసీఆర్ ప్రసంగించారు. ‘‘తెలంగాణను 56 ఏండ్ల నుండి మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వారే నన్ను ఢిల్లీకి పిలిచిండ్రు. ఎందుకని అడిగితే తెలంగాణ ఇస్తం.. మాట్లాడుకుందాం రమ్మన్నరు. కాంగ్రెస్‌పై నమ్మకం లేకున్నా పాండవుల పక్షాన కౌరవుల వద్దకు శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్లినట్లు.. అయిననూ పోయిరావలె హస్తినకు అన్నట్లుగా పోయిన. పన్నెండు ఏండ్లుగా కొట్లాడుతున్న పార్టీని విలీనం చేస్తే తెలంగాణ ఇస్తమన్నరు. ఏం చేద్దామని కోదండరాంను అడిగిన. ఎట్లయితేంది తెలంగాణ వచ్చుడే ముఖ్యమని చెప్పిండు. ఎంతోమంది నాయకుల రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి విలీనం చేయటానికి కూడా ఒప్పుకున్నం. అయినా కుక్కతోక వంకర అన్నట్లుగా కాంగ్రెస్ బుద్ధి మార్చుకోలేదు. కాంగ్రెస్ పైనే పోరాటం చేద్దామని సమరభేరితో యుద్ధం ప్రకటిస్తున్నం’’ అని ఆయన చెప్పారు. ఈ సభలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై విరుచుకుపడుతూనే వైఎస్సార్ కాంగ్రెస్‌పైనా కేసీఆర్ తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. 

బాబుకు విశ్వసనీయత ఏం తెలుసు? 


‘‘విశ్వసనీయత అంటే ఏమిటని చంద్రబాబు అడుగుతున్నడు. విశ్వసనీయత అంటే సింగపూర్ సిటీలోని దుకాణాల్లో దొరకదు. అట్లా కొంచెం ఎక్కువ దొరికితే హెరిటేజ్ దుకాణాల్లో పెట్టుకుని కమీషన్లకు అమ్ముకుంటవా? విశ్వసనీయత అంటే ఇచ్చిన మాటను అమలు చేయటం.. మాట తప్పటం కాదు. తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసి డిసెంబర్ 9 నాడు ప్రకటన రాగానే అడ్డంపడిన చంద్రబాబుకు విశ్వసనీయతంటే ఏం తెలుస్తుంది?’’ అని కేసీఆర్ ఎద్దేవాచేశారు. అలాంటి చంద్రబాబు కాళ్లయాత్ర కాదు మోకాళ్లయాత్ర చేసినా ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. ‘‘ఒకాయన ఒక లాయర్‌ను పిలిపించుకుని వీలునామా రాస్తున్నాడట. పెద్ద కొడుకుకు 70 ఎకరాల మామిడి తోట, చిన్న కొడుకుకు వందెకరాల నిమ్మతోట, బిడ్డకో 10 లక్షల రూపాయలు చెందాలని రాయమన్నాడట. అవన్నీ రాసింతర్వాత వివరాల కోసం ఎక్కడున్నాయని లాయర్ అడిగాడట. ‘ఇప్పుడైతే అవి లేవు కానీ భవిష్యత్తులో సంపాదిస్తా’ అని అన్నాడట. చంద్రబాబునాయుడు చేస్తున్న హామీలు, చెప్తున్న మాటలు అట్లనే ఉన్నయి’’ అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. 

వాళ్లేమన్నా కిన్నెరకింపురుషులా? 

‘‘పాదయాత్ర పేర్లతో ఉడుముల లెక్క తెలంగాణ మీద పడుతున్నరు. ఆచరణ సాధ్యం కాని హామీలతో చంద్రన్న రాజ్యం, రాజన్న రాజ్యం అంటున్నరు. వాళ్ల రాజ్యాలను చూడలేదా? ఏదంటే అది చేయటానికి వాళ్లేమన్నా గాంధర్వులా? కిన్నెరకింపురుషులా?’’ అని కేసీఆర్ ప్రశ్నించారు. ‘‘చంద్రన్న రాజ్యంలో ఎవరన్నా సుఖంగా ఉన్నరా? రిటైర్మెంట్లు తప్ప రిక్రూట్‌మెంట్లు లేవు. ఉద్యోగాలను తీసేసి కాంట్రాక్టు ఉద్యోగాలు చేయించిండు. పరిపాలనా సంస్కరణల పేరుతో ఉన్న ఉద్యోగాలను కుదించిండు. ఇలాంటి రాజ్యం కావాల్నా?’’ అని వ్యాఖ్యానించారు. ‘‘పులిచింతల, పోలవరంతో తెలంగాణ నీళ్లను దోచుకుపోయిన వైఎస్ పాలన మనం చూడలేదా? నలభై ఏండ్లయినా ఎస్‌ఎల్‌బీసీ పూర్తిచేయకుండా పోతిరెడ్డిపాడును మూడేండ్లలోనే కట్టేసిన రాజన్న పాలన కావాల్నా?’’ అని అడిగారు. పదిహేను వందల మంది రైతుల ఆత్మహత్యలు వైఎస్ పాలన ఫలితం కాదా అని ప్రశ్నించారు. రాజన్న రాజ్యం, చంద్రన్న రాజ్యం తమకొద్దని, తెలంగాణ రాజ్యమే కావాలని పేర్కొన్నారు. 


స్వీయ రాజకీయ శక్తిగా ఎదగాలి... 

వంద కోట్ల మంది దేశ ప్రజలు ఒప్పుకుంటే తెలంగాణ రాష్ట్రమని చెప్పిన వైఎస్ హయాంలో తెలంగాణను తీవ్రంగా నిర్లక్ష్యం చేశారని కేసీఆర్ విమర్శించారు. వైఎస్ కడపలో యోగివేమన యూనివర్సిటీని పూర్తిచేసి తెలంగాణ యూనివర్సిటీని నిర్లక్ష్యం చేశారన్నారు. కడపలోనే రిమ్స్‌ను ఆగమేఘాల మీద పూర్తిచేసి బీబీనగర్‌లోని నిమ్స్‌ను దిక్కులేకుండా చేశారని ఆరోపించారు. వక్ఫ్ భూములను లగడపాటికి ఇచ్చారన్నారు. పోలవరం కట్టి భద్రాద్రి రాముడిని ముంచే రాజ్యం మనకెందుకని ప్రశ్నించారు. ఇద్దరు ఎంపీలతోనే పార్లమెంటును వారం రోజుల పాటు స్తంభింపజేశామన్నారు. అదే 16 మంది ఎంపీలు గులాబీ జెండాలు కప్పుకుని పార్లమెంటులో ఉంటే రాష్ట్రం వచ్చేదన్నారు. తెలంగాణ కోసం వీధుల్లో పోరాడుతూనే స్వీయ రాజకీయశక్తిగా తెలంగాణ ప్రజలు ఎదగాలన్నారు.

సీమాంధ్ర సంపన్నులతోనే యుద్ధం: కోదండరాం 

ఇది తెలంగాణ ప్రజలకు, సీమాంధ్ర సంపన్నవర్గాలకు జరుగుతున్న పోరాటమని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం వ్యాఖ్యానించారు. సీమాంధ్ర నేతలతోనూ, ప్రజలతోనూ వ్యక్తిగత ద్వేషం లేదన్నారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాలను దోచుకుపోయిన పార్టీలపైనే తమ పోరాటమన్నారు. డిసెంబర్ 9న వచ్చిన తెలంగాణను.. సీమాంధ్ర సంపన్నవర్గాల బలానికి అమ్ముడుపోయిన కేంద్ర ప్రభుత్వం అడ్డుకుందని విమర్శించారు. ‘‘తెలంగాణను అడ్డుకున్నానా అని అంటున్న చంద్రబాబుకు, టీడీపీకి ప్రజల పక్షాన నిలబడాల్సిన బాధ్యత లేదా?’’ అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న, కేసులు ఎదుర్కొంటున్న, ఉద్యోగాలు కోల్పోయిన వారి గురించి మాట్లాడకుండా కేవలం అధికారం కోసమే విజయమ్మ, షర్మిల మాట్లాడుతున్నారని విమర్శించారు. నాలుగైదురోజుల్లో జేఏసీ సమావేశమై పెద్ద ఉద్యమానికి సిద్ధమవుతుందన్నారు. డిసెంబరు 9న స్ఫూర్తి దినంగా, డిసెంబరు 23న నిరసనల దినంగా పాటిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ డీజీపీ పేర్వారం రాములు, రిటైర్డ్ సీఈ విద్యాసాగర్‌రావు, దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, జేఏసీ నేతలు పాల్గొన్నారు. 

విజయశాంతి డుమ్మా: సమరభేరికి ఆ పార్టీకి చెందిన మరో ఎంపీ విజయశాంతి హాజరుకాలేదు. రెండో దశ ఉద్యమంలో కీలకంగా భావిస్తున్న సూర్యాపేట సమరభేరికి ఆమె దూరంగా ఉండటంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ‘ఆమెను టీఆర్‌ఎస్ పిలవలేదా..? లేక కావాలనే ఆమె గైర్హాజరయ్యారా..! లేక ఇతర కారణాలున్నాయా?’ అని పార్టీ శ్రేణులు ఆసక్తిగా చర్చించుకున్నాయి.


వైఎస్సార్ కాంగ్రెస్సే కేసీఆర్ లక్ష్యం!

సమరభేరి సభకు.. నల్లగొండ జిల్లా నుంచే కాకుండా పొరుగునే ఉన్న వరంగల్ జిల్లా నుంచి కూడా జనాన్ని సమీకరిం చారు. దీంతో సభాస్థలి నిండిపోయింది. కేసీఆర్ తన ప్రసంగం లో ప్రధానంగా.. ఇటీవల తెలంగాణ జిల్లాల్లో మరీ ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ముఖ్య నాయకుల చేరికలతో బలపడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్‌ను లక్ష్యంగా ఎంచుకున్నట్లు స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లాలో జరుగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రను కూడా వదల్లేదు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి పాలనలో చేపట్టిన జలయజ్ఞంలో తెలంగాణలోని ప్రాజెక్టులే పూర్తి కాలేదని ఆరోపించారు. ప్రాణహిత-చేవెళ్ల, నెట్టంపాడు, ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రాజెక్టులను ఉదహరించారు. తెలంగాణలో ఆంధ్ర పార్టీలను లేకుండా చేయాలని, ఆంధ్ర పార్టీల్లో పనిచేసే నాయకులను తరిమివేయాలని, స్వీయ రాజకీయ శక్తిగా ఎదగాలని పిలుపు ఇచ్చారు.

Tuesday, October 23, 2012

చెప్పటానికేమీ లేదు!

ప్రశ్నలతో విసిగించొద్దని మీడియా ప్రతినిధులపై ఆగ్రహం



న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: తెలంగాణ అంశం పరిష్కారం విషయంలో పురోగతి ఏదైనా ఉంటే తప్పక తెలియజేస్తామని.. ఇప్పటికైతే చెప్పటానికేం లేదని కేంద్ర ప్రవాస భారతీయ వ్యవహారాల మంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ప్రత్యేక పరిశీలకుడు వయలార్ రవి పేర్కొన్నారు. ఈ సమస్యపై పదేపదే తన వెంటపడి విసిగించవద్దని మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిల్లీలో మంగళవారం ఓ కార్యక్రమంలో పాల్గొంటున్న వయలార్ వద్దకు తెలుగు టీవీ చానళ్ల ప్రతినిధులు వెళ్లి తెలంగాణపై ప్రశ్నలు గుప్పించారు.


Sunday, October 21, 2012

పలువురు తెలంగాణవాదుల అరెస్ట్

పాలమూరులో చంద్రబాబు పాదయాత్రను అడ్డుకుంటారనే నెపంతో పోలీసులు సోమవారం తెలంగాణవాదులను ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు. నారాయణపేటలో బీజేపీ రాష్ట్ర తెలంగాణ ఉద్యమ కమిటీ కన్వీనర్‌ నాగురావు నామాజీతో పాటు మరికొందరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు బీజేపీ నేతల ఇంటికి వెళ్లి మరీ అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు.

Wednesday, October 17, 2012

నింగిలోకి నల్ల బెలూన్లు





ప్రధానికి తెలంగాణ వాదుల నిరసన..
నాగం ఆధ్వర్యంలో దీక్ష
హైదరాబాద్, అక్టోబర్ 16 : 'మీది విశ్వాస ఘాతుకం... అందుకే నిరసనల స్వాగతం' అంటూ ప్రధాని మన్మోహన్ సింగ్ రాకకు నిరసనగా తెలంగాణ నేతలు ఆకాశంలోకి నల్లబెలూన్లు ఎగురేశారు. తెలంగాణ నగారా సమితి నేత, ఎమ్మెల్యే నాగం జనార్దన రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద మంగళవారం జరిగిన దీక్షలో జేఏసీ భాగస్వామ్య పక్షాలు, ఇతర ఉద్యమ సంస్థల నేతలు పాల్గొన్నారు. నల్ల చొక్కాలు, బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.

మధ్యాహ్నం 12 గంటలకు దీక్ష ప్రారంభం కాగా... సరిగ్గా 3.35 గంటలకు నల్ల బెలూన్లను గాలిలోకి వదిలారు. దీక్ష సాయంత్రం 4.50 గంటలకు ముగిసింది. అయితే... ప్రధాని హాజరైన జీవ వైవిధ్య సదస్సుకు తెలంగాణ మీడియా ప్రతినిధులను అనుమతించకపోవటాన్ని నిరసిస్తూ బేగంపేట విమానాశ్రయానికి వెళ్తామని నాగం ప్రకటించారు. కోదండరాం, హరీశ్‌రావు, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర నాయకులంతా ఇందిరాపార్క్-లోయర్ ట్యాంక్‌బండ్ వైపు కదిలారు. నేతలు బారికేడ్లను దాటుకొని ముందుకు వెళ్లటంతో తోపులాట జరిగింది. పోలీసులు పెద్దఎత్తున వారిని చుట్టుముట్టి, అరెస్ట్ చేశారు.


ఈ సమయంలో ఒక కానిస్టేబుల్‌పై ఉద్యమకారులు చేయి చేసుకున్నారు. అరెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు, ఇతర నాయకులను వ్యాన్‌లో గాంధీనగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి తదుపరి విడిచిపెట్టారు. కాగా, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ప్ర'దానిని కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు బయలుదేరిన టీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.



కాగా, "తెలంగాణ వాదులకు పాలకులు భయపడుతున్నారంటే.. మనం సగం గెలిచినట్టే లెక్క'' అని జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. "ప్రధాని హైదరాబాద్‌కొస్తే ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? నిరసన తెలుపుతామన్న తెలంగాణవాదులను అడ్డుకున్నారు. చివరికి నల్ల బుగ్గలను, వాటిలో గాలి నింపటానికి ఉపయోగించిన సిలిండర్లనూ 'అరెస్ట్' చేశారు'' అని మండి పడ్డారు.



దసరా తర్వాత సీఎం, మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఎవరైనా సరే.. వారిని ఊళ్లలోకి అడుగుపెట్టనివ్వొద్దని దీక్షకు అధ్యక్షత వహించిన నాగం జనార్దన రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ విషయంలో మోసం, దగా చేసిం ది కాంగ్రెస్సేనని విమర్శించారు. ప్రభుత్వం పోతుంది అంటేనే ఒత్తిడి వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత కేశవరావు అన్నారు. "ఎంపీలుగా మేం ఏం చేసినా ఎందుకో ఒత్తిడి రాలేదు. తెలంగాణపై తీర్మానం చేసే వరకు అసెంబ్లీకి రాబోమని 28 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి ఒక్క లేఖ రాస్తే, ప్రత్యేక రాష్ట్రం ఎలా రాదో చూస్తాం!' అని కేకే అన్నారు.



"మర్యాదగా తెలంగాణ ఇస్తే సై.. లేకపోతే కాంగ్రెస్ అంతం చూస్తాం'' అని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. ఇం కా కాంగ్రెస్‌లో ఉండి తెలంగాణ ముసుగులో ఐక్యంగా కొట్లాడుతామంటే నమ్మే పరిస్థితిలేదని టీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్ రావు అన్నారు. ప్రధాని మాటకు విలువలేదని, కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వదని బీజేపీ నేత దత్తాత్రేయ అన్నారు. తెలంగాణపై అంతా టీడీపీని తప్పుపడుతున్నారని తొలుత అధికారంలో ఉన్న కాంగ్రెస్ సంగతి తేల్చితే, టీడీపీ సంగతి ప్రజలు చూసుకుంటారని సీపీఐ నేత వెంకటరెడ్డి పేర్కొన్నారు.

ప్రాణహిత-చేవెళ్ల ను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలి

తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతిపథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కోరుతూ ప్రభుత్వ విప్ టి.జగ్గారెడ్డి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు వినతిపత్రం అందజేశారు. జీవవైవిధ్య సదస్సులో మంగళవారం నాడు పాల్గొన్న ప్రధానమంత్రిని విప్ జగ్గారెడ్డి కలిశారు. తెలంగాణలోని పది జిల్లాల్లో వ్యవసాయమంతా వర్షాధారంపైనే సాగుతున్నదని విప్ జగ్గారెడ్డి ప్రదానికి వివరించారు. అంతేగాక సాగునీటి రంగంలో భారీ, మధ్య తరహాప్రాజెక్టులు కూడా లేవని పేర్కొన్నారు. అందువల్ల తెలంగాణ ప్రాంత రైతాంగం శ్రేయస్సు దృష్ట్యా ప్రాణహిత-చేవెళ్ల పథకం అత్యంత అవసరమన్నారు.

Tuesday, October 16, 2012

మీతో మాట్లాడాలి..టైమ్ ఇవ్వండి ప్లీ..

ప్రధానిని కోరిన తెలంగాణ మంత్రులు

తెలంగాణ ఆవశ్యకతను వివరిస్తూ వినతిపత్రం అందజేసిన మంత్రులు






హైదరాబాద్,ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై చర్చించడానికి తమకు సమయమివ్వాలని తెలంగాణ మంత్రులు ప్రధాని మన్మోహన్‌ను కోరారు. తెలంగాణపై వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు ప్రధానికి వివరించారు. ప్రధాని మంగళవారం రాష్ట్ర పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్లే సమయంలో బేగంపేట ఎయిర్‌పోర్టులో వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో గవర్నర్ నరసింహన్, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జానారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, గీతారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, బసవరాజు సారయ్య, డీకే అరుణ తదితరులు ప్రధానినిని కలిశారు. ఆయనకు వినతిపత్రాన్ని అందజేసి, 2 నిమిషాలు మాట్లాడారు.

Thursday, October 11, 2012

షిండేకు ఏం తెలుసు?

తెలంగాణ అంశంపై కేసీఆర్‌తో ఎలాంటి చర్చలూ జరపడం లేదంటూ కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే చేసిన వ్యాఖ్యలు ఆయన అవగాహనారాహిత్యానికి నిదర్శనమని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధ్దన్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలే కేసీఆర్‌తో చర్చలు జరపారని, ఈ విషయాన్ని ఏఐసీసీ మీడియా కమిటీ చైర్మన్ జనార్దన్ ద్వివేది, కేంద్రమంత్రి వయలార్ రవి ధ్రువీకరించారన్నారు. గురువారమిక్కడ ఎమ్మెల్సీలు కె.ఆర్.ఆమోస్, కె.యాదవరెడ్డితో కలిసి పాల్వాయి మీడియాతో మాట్లాడారు. ‘‘కేసీఆర్‌తో చర్చలు జరపడం లేదని షిండే చెప్పి మరింత గందరగోళం సృష్టించారు.

అసలు షిండేకు ఏం తెలుసు? కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పరిధిలోనే తెలంగాణపై చర్చలు జరుగుతున్నాయని వయలార్ రవి కూడా చెప్పారు. బహుశా కేసీఆర్ తనను కలవలేదని షిండే అవమానకరంగా భావించి ఆ మాటలన్నారేమో. అయినా ప్రతిఒక్కరితో చర్చలు జరపడం సాధ్యంకాదు. హైకమాండ్ మాత్రం తెలంగాణపై కేసీఆర్‌తో చర్చలు జరిపింది.. జరుపుతోంది.. భవిష్యత్తులోనూ అవి కొనసాగుతాయి’’ అని పేర్కొన్నారు. తెలంగాణపై తొలుత కాంగ్రెస్ పరిధిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, అది జరిగాకే ప్రభుత్వంతో మాట్లాడతారని చెప్పారు. దసరాలోపు తెలంగాణపై హైకమాండ్ నిర్ణయం వెలువరిస్తుందని తాను భావించట్లేదన్నారు. కేసీఆర్‌తో చర్చలు మాత్రం సంతృప్తికరంగా సాగుతున్నాయన్నారు.

కేసీఆర్‌ తో చర్చలు లే..

ప్రత్యేక తెలంగాణ అంశంపై తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావుతో తాము చర్చలు జరపటం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. అలాగే.. ఈ విషయంపై అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం తెలుసుకునేందుకు ఇప్ప ట్లో అఖిలపక్ష సమావేశం నిర్వహించే ప్రణాళిక కూడా ఏదీ లేదని తేల్చిచెప్పింది. తాము కేంద్రంలోని పెద్దలతో చర్చలు జరుపుతున్నామని కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ ఒకవైపు చెప్తుండగా..